Kadapa Politics AP Elections 2024: సీఎం జగన్ సొంత జిల్లాకేంద్రం కడపలో వైసీపీ ఆవిర్భాం నుంచి ఆ పార్టీదే హవా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి కడప అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ కుటుంబానికి ఎదురే లేకుండా పోయింది
Kadapa Politics AP Elections 2024: సీఎం జగన్ సొంత జిల్లాకేంద్రం కడపలో వైసీపీ ఆవిర్భాం నుంచి ఆ పార్టీదే హవా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి కడప అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ కుటుంబానికి ఎదురే లేకుండా పోయింది. అలాంటి కంచుకోటలో వైసీపీకి హ్యాట్రిక్ విజయం అంత ఈజీ కాదంటున్నారు. కడప నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై వైసీపీలో పెరుగుతున్న వ్యతిరేకత ఆయన విజయపరంపరకు చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీపై అభిమానంతో పార్టీ విజయానికి సహకరించిన కడప కార్పొరేటర్లు.. డిప్యూటీపై తీవ్ర అసంతృప్తితో ఏకంగా పార్టీ మార్చే ఆలోచన చేస్తుండటం.. వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోందంట.
కడప అసెంబ్లీ నియోజకవర్గం. వైఎస్ కుటుంబానికి కంచుకోట. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాం నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకు వారి హవానే నడుస్తోంది. అంతకు ముందు టీడీపీ కడపలో మూడు సార్లు విజయం సొంతం చేసుకున్నప్పటికీ 2004 ఎన్నికల నాటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. 2004,2009 ఎన్నికల్లో అక్కడ నుంచి కాంగ్రెస్ గెలిస్తే.. ఆ తర్వాత కడప ఓటర్లు వైపీసీకి పట్టంగడుతూ వస్తున్నారు. వైఎస్ బ్రాండ్తో కడప నుంచి ఎవరూ పోటీ చేసినా గెలవడం రివాజుగా మారిపోయింది.
2004, 2009 ఎన్నికల్లో వైఎస్ అండదండలతో అహ్మదుల్లా వరుసగా రెండు సార్లు గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ మరణాంతరం ఆయన జగన్ని కాదని కాంగ్రెస్లోనే కొనసాగడంతో రాజకీయంగా తెరమరుగు అవ్వాల్సి వచ్చింది. ఆ క్రమంలో 2014లో అప్పటి వరకు కార్పొరేటర్గా ఉన్న అంజాద్ బాషా.. వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచే కడప నవాబ్ తానే అని చాటుకోవడానికి ఆరాటపడుతున్నారు.
గత ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన అంజాద్ బాషా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్యెల్యేగా రికార్డులకు ఎక్కారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన సీన్ రివర్స్ కావడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత రెండు సార్లు ప్రత్యర్థి వేరు.. ఇప్పుడు టీడీపీ నుంచి బరిలోకి దిగేది వేరని, అన్ని విధాలా బలమైన ప్రత్యర్ధితో ఢీ కొనడం అంజాద్ బాషా అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది.
కడప గడపలో జగన్కు షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత బలమైన నేతకు అక్కడి బాధ్యతలు అప్పగించారు. కడప జిల్లా టీడీపీలో కీలకంగా ఉండే పోలిటి బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి భార్య రెడ్డెప్పగారి మాధవీరెడ్డి కడప ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నారు. బలమైన రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన ఆమె ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు కూడా అయిన శ్రీనివాసులు రెడ్డి తండ్రి మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి .. ఆయన అన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కడపలో తన సతీమణి గెలుపే లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారు శ్రీనివాసులు రెడ్డి అలియాస్ వాసు. వాసు అన్న పేరుతో కడప జిల్లాలో పెద్ద ఆర్మీనే ఉందాయనకి.
అంజాద్ బాషాకు వ్యతిరేకంగా మాధవీ రెడ్డి డోర్ టు డోర్ కాన్వాసింగ్తో దూసుకుపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అంజాద్ బాషా కడప నగరానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఉన్న కూడళ్ళను కూలగొట్టి మళ్ళీ నిర్మిస్తే అభివృద్ధి అవుతుందా అని ధ్వజమెత్తుతూ జనాన్ని ఆలోచింప చేస్తున్నారు. మరోవైపు సొంత పార్టీలోనే అంజాద్ బాషాకు ఎదురు గాలి వీస్తోంది.
కడప మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న కార్పొరేటర్లు డిప్యూటీ సీఎంపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు రాక ఎవరిని అడగాలో అర్ధం కాక ఎమ్మెల్యే కూడా పట్టించుకోక పోతుండటంతో వారిలో అసంతృప్తి పెరిగిపోతోందంట. నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నారట.
ఇదే అదునుగా టీడీపీ నేతలు, కార్పొరేటర్లు వారితో టచ్లోకి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారంట. ఆ చర్చలు సక్సెస్ అవ్వడంతో దాదాపు 20 మంది కార్పొరేటర్లు సైకిల్ సవారీకి రెడీగా ఉన్నారంటున్నారు. అదే ఇప్పుడు కడప పొలిటికల్ సర్కిల్స్లో హాటా టాపిక్గా మారింది. ఆ లాంఛనం పూర్తై పోతే అంజాద్ బాషా హ్యాట్రిక్ కలలపై నీళ్లు చల్లినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.