Krishnan Mahadevan Quits High Paying Job Started Selling Idlis: స్థిరమైన ఉద్యోగం.. కళ్లు చెదిరే జీతం.. ఎవరికైనా ఇంతకన్నా ఏం కోరుకుంటారు? కృష్ణన్ మహదేవన్ ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నం. కడుపులో చల్ల కదలకుండా.. కాలు మీద కాలు వేసుకుని హాయిగా జీవితాన్ని వెళ్లదీసే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కొలువునే కాదనుకున్నాడు మహదేవన్. ఎందుకిలా చేశాడని అనుమానం రావొచ్చు.
బెంగళూరులోని విజ్ఞాన్నగర్లోని అయ్యర్ ఇడ్లీ అనే చిన్నషాపు బాగోగులు చూసుకోవడానికి అంటే విస్మయం కలుగుతుంది. చక్కటి ఉద్యోగం కన్నా కుటుంబ వ్యాపారమే ముఖ్యమని మహదేవన్ భావించాడు. అందుకే కొలువుకు గుడ్బై చెప్పేసి అయ్యర్ ఇడ్లీ దుకాణ బాధ్యతలను తీసుకున్నాడు.
అయ్యర్ ఇడ్లీని 2001లో మహదేవన్ తండ్రి ఆరంభించారు. ఏ సమయంలో వెళ్లినా వేడివేడిగా ఇడ్లీలు సర్వ్ చేయడం ఆ షాపు ప్రత్యేకత. అందుకే రెండు దశాబ్దాలుగా అన్ని తరగతుల వారు అయ్యర్ ఇడ్లీ అంటే పడి చస్తారు. ఇప్పటికీ అదే క్రేజ్. మహదేవన్ తండ్రి దాదాపు 19 ఏళ్ల పాటు వేడి వేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీతో కలిపి విక్రయించారు.
Read More: Paytm moves Third Party: థర్డ్ పార్టీకి పేటీఎం.. ఎప్పటినుంచో తెలుసా..?
ఆ చట్నీతో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఇడ్లీల రుచి ఉంటుంది. అందుకే చుట్టుపక్కల ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా అయ్యర్ ఇడ్లీ కోసమే జనం ఎగబడుతుంటారు. 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న ఆ చిన్న షాపు నెలకు 50 వేల ఇడ్లీలు విక్రయిస్తుందంటే.. నాణ్యత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అర్థమవుతుంది.
షాపునకు హంగులూ, ఆర్భాటాలు అంటూ ఏవీ ఉండవు. కానీ క్వాలిటీతో పాటు తాజాదనం, రుచి, శుచి మాత్రమే పాటించడం వల్ల తిండిప్రియులు క్యూకడుతుంటారు. షాపు నిర్వహణ బాధ్యతలు కృష్ణన్ మహదేవన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత.. ఇడ్లీతో పాటు వడ, కేసరిబాత్, ఖారాబాత్ను కూడా మెనూకి జత చేశారు.
2009లో తండ్రి మరణించిన అనంతరం.. ఆ షాపు బాధ్యతలు మహదేవన్, అతని తల్లి ఉమ చూసుకుంటున్నారు. షాపులో పనులు ముగించుకున్న తర్వాత మహదేవన్ కాలేజీకి వెళ్లేవాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా కొంత కాలం ఇలాగే కొనసాగింది. అనంతరం కొలువుకు గుడ్ బై చెప్పేసి.. పూర్తి సమయం ఫ్యామిలీ బిజినెస్కే కేటాయించాడు మహదేవన్.