Sri Jyothi Vinayaka Temple In Nellore: జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. అందుకే గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నా తమదైన ప్రత్యేకతతో భక్తజన సందోహంతో నిత్యం అలరారుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులోని జ్యోతి వినాయక మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో 33 రూపాల్లో గణపతి దర్శనమిస్తాడు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో మూలవిరాట్టు జ్యోతివినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. అందుకే ఈ ఆలయంలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.
కొత్త వాహనం కొన్నా, కాసు బంగారం తీసుకున్నా భక్తులు ముందుగా వెళ్లి స్వామికి పూజలు చేయిస్తారు. ఇక అన్నప్రాసనతో మొదలుపెడితే పరీక్షలూ ఉద్యోగాల ఇంటర్వ్యూల వరకూ.. ఏదీ జ్యోతి వినాయకుని సమక్షంలో విన్నవించుకోకుండా ముందడుగు వేయరు.
Read More: Shani Astha Effect: శని అస్తమన.. ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బే డబ్బు..
సాధారణంగా బాల గణపతి నుంచి సంకటహర గణపతి వరకూ వినాయకుడి రూపాల్లో ముప్ఫై రెండిటిని విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖాల సంఖ్యా, చేతుల్లో ధరించే విభిన్న ఆయుధాలూ, మొత్తంగా మూర్తి స్వరూపాలను బట్టి ఒక్కో గణపతి రూపానికీ ఒక్కో పేరుంటుంది. ఒక్కో రూపాన్నీ ఒక్కో తిథినాడు కొలవడమూ ఆనవాయితీ.
బాలారిష్టాలు తీరాలంటే బాల గణపతినీ, మనశ్శాంతి లేనివాళ్లు హేరంబ గణపతినీ, అప్పుల బాధతో బాధపడేవాళ్లు రుణవిమోచన గణపతినీ.. ఇలా భక్తులు తమ కోరికకు తగిన గణపతి రూపాన్ని ఎంచుకుని పూజిస్తుంటారు. జ్యోతి వినాయకుడి గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారంలో ఇటువంటి 32 విగ్రహాలను దర్శించుకోవచ్చు.