Meet HAPS India’s New Surveillance(Latest tech news): సరిహద్దుల్లో నిఘా, నియంత్రణ సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చేపట్టిన సౌరశక్తి ఆధారిత ‘సూడో శాటిలైట్’ తొలి పరీక్ష విజయవంతమైంది.
అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(UAV) రంగంలో ఇదో కొత్త సాంకేతికత. దీనిని హై-ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ వెహికల్(HAPS) అని వ్యవహరిస్తున్నారు. భూఉపరితలం నుంచి 18-20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ యూఏవీ ఎగరగలదు.
విమానాలు ఎగిరే ఎత్తుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఈ యూఏవీ ప్రత్యేకత. దీంతో నెలలు, సంవత్సరాల తరబడి అది అలా గాల్లో ఎగరగలుగుతూనే ఉంటుంది. ఓ ఉపగ్రహంతో కలిగే ప్రయోజనాలన్నీ HAPS-హాప్స్ వల్ల పొందే వీలుంది.
స్పేస్లోకి ప్రవేశించేందుకు.. శాటిలైట్లాగా దీనికి ఎలాంటి రాకెట్ అవసరం అక్కర్లేదు. అంటే సాధారణ ఉపగ్రహానికయ్యే నిర్వహణా ఖర్చులతో పోలిస్తే.. హాప్స్ వ్యయం ఎంతో తక్కువనే చెప్పాలి. కాకపోతే శాటిలైట్లను భూమినుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో పని చేస్తుంటాయి.
హాప్స్ సాంకేతికత ఇంకా మొగ్గదశలోనే ఉన్నా.. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్(NAL) గత వారం చేపట్టిన టెస్ట్ ఫ్లయిట్ విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ టెస్ట్ ఫ్లయిట్ నిర్వహించారు. 23కిలోల బరువు, 12 మీటర్ల రెక్కల పొడవు ఉన్న హాప్స్ దాదాపు 8.30 గంటలపాటు 3 కిలోమీటర్ల ఎత్తు వరకు గాల్లో ఎగరగలిగింది.
Read More: Yamaha New Bike: మార్కెట్లోకి మరో కొత్త యమహా బైక్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే?
హాప్స్ టెక్నాలజీ పురోగతిలో ఇదో కీలక ముందడుగుగా భారత శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెబుతున్నారు. వచ్చే నెలలో చేపట్టబోయే పరీక్షలో 24 గంటల పాటు ఎగిరే సామర్థ్యం సంతరించుకుందా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తారని తెలుస్తోంది.
సోలార్ సెల్స్, బ్యాటరీల చార్జింగ్ పనితీరు, పగలంతా చార్జింగ్ చేసుకుని రాత్రంతా ఆ శక్తిని వినియోగించుకోగల అంశాన్ని, సౌరశక్తిని ఉత్పత్తి చేసుకొనే విధానాన్ని నిశితంగా పరీక్షిస్తారు. 2027 నాటికి హాప్స్ అందుబాటులోకి వస్తుందని ఎన్ఏఎల్ డైరెక్టర్ అభయ్ పంత్ ఫసిల్కర్ వెల్లడించారు.
2017లో డోక్లాం సంక్షోభం నేపథ్యంలో సరిహద్దుల్లో నిరంతర నిఘా అవసరమని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. శత్రుదేశాల కదలికలపై ఓ కన్ను వేయడంలో భాగంగా హాప్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సంకల్పించింది.
బ్యాటరీ ఆధారిత యూఏవీలు పరిమిత కాలానికి మాత్రమే గాల్లో ఉండగలవు. అందునా.. వాటి వల్ల కొద్ది ప్రాంతంపైనే నిఘా సాధ్యమవుతుంది. ఈ నేపత్యంలో సౌరశక్తితో పనిచేసే యూఏవీ తగిన ప్రత్యామ్నాయమనే నిర్ణయానికి వచ్చారు. దీంతో హాప్స్ టెక్నాలజీ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఈ సాంకేతికతపై కొన్ని దేశాలు మాత్రమే పరిశోధనలు చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు సౌరశక్తి ఆధారంగా పనిచేసే యూఏవీలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మన దేశం సహామరికొన్ని ఇతర దేశాల్లో హాప్స్ టెక్నాలజీపై ప్రైవేటు సంస్థలు సైతం పనిచేస్తున్నాయి.