Rats Bites ICU Patient in Kamareddy Government Hospital: ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఎర్ర నీళ్ల మందు, సున్నాపు నీళ్ల సూదులు.. నేను రాను బిడ్డో గండాల దవాఖానకు’.. ఈ పాట వచ్చి చాలా ఏళ్లయ్యింది. కానీ నాటి పాట నేటి సమాజ దుస్ధితికి అద్ధం పడుతోంది. నొప్పొచ్చినా, రోగమొచ్చినా దవాఖానకు అసలే పోవద్దు అన్న నానుడి ప్రస్తుత సమాజానికి సరిగ్గా సరితూగుతుంది.
ఇలాంటి ఘటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అసలే పానం బాలేక దవాఖానకు పోతే ఎలుకలతో యమలోకానికి దగ్గరవుతున్నారు. ఆస్పత్రిలో ఎలుకలు బెడద రోగులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. వారం రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. ఎప్పట్లాగే రాత్రి అవ్వగానే ఎలుకులు ఐసీయూలోకి వచ్చేశాయి. ఈ క్రమంలో ఐసీయూ బెడ్ మీద ఉన్న షేక్ ముజీబ్ కాళ్లు, చేతులను కొరికేశాయి. దీంతో ముజీబ్కు తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన రోగి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లకు సమాచారం అందించారు.
Read More: బీఆర్ఎస్ స్కామ్లపై సీఎం ఫోకస్.. త్వరలో వాటిపై విచారణ..
ఇది గమనించిన మిగతా రోగులు, వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నారు. రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలని, డబ్బులు లేకనే సర్కారు దవాఖానకు వస్తున్నామని తెలిపారు. ఇక్కడ చూస్తే ఎలుకలు ప్రాణం తీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
కాగా ఐసీయూలోని పీఓపీ భాగం దెబ్బతిన్నదని.. ఆ రంధ్రం నుంచి ఎలుకలే వస్తున్నాయని రోగులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవ్వడంతో మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎలుకల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు.