CM Revanth Reddy focusing on BRS Scams: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కట్టడాల్లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ దృష్టిపెట్టింది. కేసీఆర్ సర్కార్.. ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహాలను నిర్మించింది. అయితే వాటికి టెండర్లు పిలిచినప్పుడు ఒక అంచనా ఉండగా.. నిర్మాణం జరిగినప్పుడు అమాంతంగా అంచనాలను పెంచేసి.. జేబులు నింపుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా బయటపడడం సంచలనంగా మారింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా అవకతవకలను విజిలెన్స్ గుర్తించింది. దీంతో ప్రాజెక్టు భవితవ్యమే ప్రమాదంలో పడటంతో.. కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితిని అన్ని పార్టీల నేతలకు చూపాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఈనెల 13న అఖిలపక్షంతో మేడిగడ్డ పర్యటన చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యారేజ్కు సంబంధించి కేసీఆర్ సర్కార్ భారీగా అంచనాలను పెంచేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది.
మిషన్ భగీరథ పథకంలో అవకతవకలు జరిగాయంటూ సీఎం రేవంత్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మెటీరియల్ కొనుగోలు వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టు, పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో మిషన్ భగీరథ పైప్లైన్ పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఈ పథకంలో 7 వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ.. విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక సమర్పించింది.
Read More: బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా.. ప్రతిపక్ష నాయకుడికి ఇది తగునా..?
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో మిషన్ భగీరథ కూడా ఒకటి. భారీ ఖర్చుతో చేపట్టారు. అయితే.. ఇందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని.. పైపుల పేరుతో స్కామ్ చేశారని విమర్శలు ఉన్నాయి. వాటి లెక్క తేల్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టపై విచారణ ప్రారంభమైతే బీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాలపై విచారణ జరిపిస్తామన్నారు రేవంత్రెడ్డి.