PM Modi Last Speech In 17th Lok Sabha: సంస్కరణలు, పనితీరు, పరివర్తనే ఎన్డీయే ప్రభుత్వ మంత్రమని ప్రధాని మోదీ(PM Modi) శనివారం లోక్ సభలలో పేర్కొన్నారు. ఎన్నో తరాలుగా ఎదురుచూస్తున్న అనేక నిర్ణయాలను 17వ లోక్ సభ తీసుకుందని, జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి అంశాలను మోదీ ఉదహరించారు.
17వ లోక్ సభ చివరి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 17వ లోక్ సభ ఉత్పాదకత 97 శాతంగా ఉందన్నారు. మొత్తం 30 కీలక బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు.
ప్రభుత్వం.. దైనందిన జీవితం నుంచి ప్రజలను ఎంత త్వరగా బయటపడేస్తే అంతే త్వరగా ప్రజాస్వామ్యం బలపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. కనీస ప్రభుత్వం, గరిష్ట పాలనను తాను విశ్వసిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజలకు సామాజిక న్యాయం తీసుకొచ్చిందని, కఠిన చట్టాల ద్వారా ఉగ్రవాదాన్ని అణచివేసిందని ప్రధాని మోదీ అన్నారు.
Read More: ఉభయ సభలు నిరవధిక వాయిదా.. ఐదేళ్లలో 222 బిల్లుల ఆమోదం..
ఈ ఐదేళ్లు దేశంలో సంస్కరణలు, పనితీరు, పరివర్తనకు సంబంధించినవి. సంస్కరణ, పనితీరు రెండూ జరగడం చాలా అరుదు, మన కళ్లముందే పరివర్తనను చూడగలం.. 17వ లోక్ సభ ద్వారా దేశం దీనిని అనుభవిస్తోందని, 18వ లోక్ సభను దేశం ఆశీర్వదిస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు.
ఈ లోక్ సభ పదవీకాలంలో ఎన్నో తరాలు ఎదురుచూసిన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ లోక్ సభ హయాంలోనే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇందుకు రాజ్యాంగాన్ని రూపొందించిన వారు మమ్మల్ని ఆశీర్వదిస్తారని తాను భావిస్తున్నానని ప్రధాని స్పష్టం చేశారు.
75 ఏళ్ల పాటు బ్రిటీష్ వారు ఇచ్చిన శిక్షాస్మృతితోనే జీవించాం. దేశం 75 సంవత్సరాలుగా అదే శిక్షాస్మృతిని ఉపయోగించింది. కానీ తరువాతి తరం న్యాయ సంహితతో కలిసి జీవిస్తుందని గర్వంగా చెప్పవచ్చుని, ఇదే నిజమైన ప్రజాస్వామ్యం అని అన్నారు.