Indefinite Adjournment of Parliament Meetings(Today’s breaking news in India): పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్లు సభలను నిరవధికంగా శనివారం వాయిదా వేశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 17వ లోక్సభకు ఇదే చివరి సమావేశం.
17వ లోక్సభలో గత ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సమావేశాల చివరి రోజున రామమందిర నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై హోం శాఖ మంత్రి అమిత్షా మాట్లాడారు. ప్రధాని మోదీ కూడా సభనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఓంబిర్లా మాట్లాడుతూ.. అధికార, విపక్ష బెంచ్లను సమానంగా చూశానన్నారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు కొన్నిసార్లు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
2019లో లోక్సభ కొలువుదీరినప్పుడు 303 మంది సభ్యులతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్యా బలం 290కి తగ్గినా.. కాషాయ పార్టీకే అత్యధిక మెజార్టీ ఉంది.
Read More: సమస్యలపై వాదించేటప్పుడు సంస్థల పేర్లు తీసుకురావద్దు.. స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక..
2019లో జాతీయ పార్టీల నుంచి 397 మంది పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 52 మంది గెలుపొందారు.. ఇప్పుడా సంఖ్య 48కి తగ్గింది. తృణమూల్ కాంగ్రెస్కు 22ఉన్నాయి. డీఎంకే 24 మంది సభ్యులు ఉన్నారు.
ప్రస్తుత లోక్సభలో 70 ఏళ్ల పైబడినవారు తక్కువే ఉన్నారు. అత్యధిక ఎంపీలు 40 ఏళ్లలోపువారే ఉండడం గమనార్హం. సభ్యుల సగటు వయసు 54 ఏళ్లుగా ఉంది.
బిజు జనతాదళ్ ఎంపీ చంద్రాణీ ముర్ము 25 ఏళ్ల 11 నెలల వయసులో లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత సభలో అతి పిన్న వయస్కురాలిగా ఉన్నారు.
ఇక, ఎస్పీకి చెందిన 89ఏళ్ల షాఫిఖర్ రహ్మాన్ బర్క్ అతి పెద్ద వయస్కులుగా ఉన్నారు. పార్లమెంట్ లోకి 260 మంది ఎంపీలు తొలిసారి ఎన్నికైనవారు ఉన్నారు. గత లోక్సభతో పోలిస్తే.. మళ్లీ ఎన్నికైన వారి సంఖ్య కూడా పెరిగింది. 17వ లోక్సభలో దాదాపు 400 మంది గ్రాడ్యుయేట్లు 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు.
ఇప్పుడా సంఖ్య 77కు తగ్గింది. అయితే 16వ లోక్సభ (62 మంది)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువగానే ఉంది. ఎంపీల్లో 39 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా చూపించారు. 38 శాతం మంది వ్యవసాయదారులు ఉన్నారు. 23 శాతం మంది వ్యాపారవేత్తలు సభలో ఉన్నారు.