Indian lottery won: లాటరీ రూపంలో ఓ భారతీయుడికి జాక్పాట్ తగిలింది. ఉచితంగా వచ్చిన టికెట్ రూపంలో రూ.33 కోట్ల భారీ అదృష్టం వరించింది. మీడియా కథనాల ప్రకారం.. కేరళ(Kerala)కు చెందిన రాజీవ్ అరిక్కట్.. కొన్నేళ్లుగా యూఏఈలో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్ గత మూడేళ్లుగా బిగ్ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
రాజీవ్ అరిక్కట్ కు ఆరు టికెట్లు లభించాయని తెలిపారు. బిగ్ టికెట్పై స్పెషల్ ఆఫర్ వచ్చిందన్నారు. తను రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందానని పేర్కొన్నారు. తనకు లాటరీ తగులుతుందని ప్రతిసారీ నమ్మకంతో ఉంటానన్నారు. ఈ సారి ఆరు టికెట్లు ఉండేసరికి ఆ నమ్మకం ఇంకా ఎక్కువైందన్నారు. తన భార్యతో కలిసి 7, 13 నంబర్తో ఉన్న టికెట్లు కొన్నామని తెలిపారు. అవి తన పిల్లల పుట్టినరోజు తేదీలని ఆయన వెల్లడించారు.
మూడేళ్లలో మొదటిసారి తనకు అదృష్టం కలిసివచ్చిందని రాజీవ్ అరిక్కట్ పేర్కొన్నారు. ఉచితంగా వచ్చిన టికెట్తో మాకు విజయం లభించిందన్నారు. లాటరీ గెల్చుకున్నానంటూ తన పేరు ప్రకటించగానే పట్టరాని సంతోషం కలిగిందని తెలిపారు. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనన్నారు.
తనతో పాటు మా వాళ్లందరి జీవితాలను మార్చిన క్షణం అంటూ రాజీవ్ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. తాను గెల్చుకున్న 15 మిలియన్ల దిర్హమ్లు డబ్బుపై ఎలా ఖర్చు పెట్టాలన్న దానిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, తన ఉదార హృదయాన్ని మాత్రం చాటుకున్నారు. ఆ డబ్బును మరో 19 మందితో సమానంగా పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి, ట్విస్ట్ ఇచ్చారు.