YS Sharmila news today(AP latest news): రాష్ట్రంలో నియంత పాలకులను తరిమి కొట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారారని ఆరోపించారు.
జగన్ ను సింహం, పులి అని పొగుడుతుంటారని షర్మిల అన్నారు. బీజేపీ ముందు పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, తెలుగుదేశం రెండూ బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు.
ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని ఆ డబ్బులన్నీ జనానివేనని షర్మిల అన్నారు. ఎన్నికల్లో పంచే డబ్బులు అన్ని ఇసుక, బాక్సైట్, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులేనని పేర్కొన్నారు. ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి వేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులను ఎలా తరిమి కొట్టారో.. నియంత పాలకులను అలా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడని, పాలక పక్షం, ప్రతిపక్షం వద్దని షర్మిల తేల్చి చెప్పారు.