BJP Politics In AP(AP news today telugu): మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తోంది. కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఫ్యామిలీ ప్లానింగ్ను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదన్నారు. కొత్త మిత్రులు వస్తున్నారని వెల్లడించారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిందని పేర్కొన్నారు. ఏపీలో పొత్తుపై కొన్నిరోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పొత్తు ధర్మాన్ని తాము ఉల్లంఘించలేదని అమిత్ షా చెప్పుకొచ్చారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు మిత్రులు వచ్చి చేరుతుంటారని అన్నారు. ఎన్టీఏలోకి కొత్త మిత్రులు వస్తుంటారు వెళుతుంటారని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. ఇలా అమిత్ షా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి.
Read More: వైసీపీ ఓటమికి త్రిశూల వ్యూహం.. సీట్ల సర్దుబాటులో చిక్కులు వీడేదెప్పుడు ?
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అది సార్వత్రిక ఎన్నికల సమయం. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పై కోపంగా ఉన్నారు. ఈ అవకాశం బీజేపీ ఉపయోగించుకుంది. టీడీపీతో జతకట్టింది. ఈ రెండు పార్టీలకు కొత్తగా ఏర్పడిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ మద్దతు పలికింది. ఫలితంగా ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి 2 ఎంపీ స్థానాలు దక్కాయి. వైసీపీ 8 స్థానాలను సొంతు చేసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఏపీ ప్రతి పక్షంగా ఉన్న వైసీపీ కూడా బీజేపీతో రహస్య దోస్తికి ప్రయత్నించింది. ప్రత్యేకహోదా హామీ అమలు చేయకపోవడంతో టీడీపీ-బీజేపీ మధ్య దూరం పెరిగింది. ఇదే కారణంతో ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. బీజేపీపై అప్పటి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేపట్టారు. కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో అమిత్ షా వాహనంపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కాషాయ, పసుపు పార్టీలు అలా ఉప్పు-నిప్పుగా మారాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ పరోక్షంగా మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు వచ్చాయి . రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపట్టింది. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. అలాగే వైసీపీ 22 ఎంపీ సీట్లు గెలిచింది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు.
ఎన్నికల తర్వాతా టీడీపీకి చెందిన అప్పటి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. కేంద్రంలో అనేక సందర్భాల్లో ఏపీకి చెందిన 25 మంది లోక్ సభ సభ్యులు బీజేపీకే మద్దతు తెలిపారు. రాజ్యసభలోనూ అనేక బిల్లుల ప్రవేశ పెట్టిన సమయంలోనే వైసీపీ, టీడీపీ మద్దతు తెలిపాయి. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా ఆ పార్టీకి పూర్తి మద్దతు లభించింది.
Read More: పొత్తులపై కామెంట్స్.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్..
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీ ఎన్నికల జరగబోతున్నాయి. చాలాకాలం నుంచి బీజేపీ-జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయి. ఎలాగైనా వైఎస్ జగన్ ను సీఎం పదవి నుంచి గద్దె దించాలన్న లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్ కాషాయ పార్టీతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే పసుపు పార్టీకి పొత్తుకు సై అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేసి టీడీపీతో మళ్లీ జతకట్టారు.
మరోవైపు ఇన్నాళ్లూ జనసేనతోనే మా స్నేహం అంటూ బీజేపీ నేతలు రాగాలు తీస్తూ వచ్చారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీడీపీతో పొత్తు ఉండదనే ఆయనే స్వయంగా చాలా సార్లు బహిరంగ ప్రకటనలు చేశారు.
పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారింది. ఆమె బాధ్యతలు స్వీకరించి తొలి రోజు నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఎటాక్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా హింట్ ఇచ్చేశారు. బీజేపీ-జనసేన పొత్తుపై కొత్తగా ప్రకటించాల్సింది ఏమీ లేదు. పొత్తుపై నిర్ణయమంటే ఇక టీడీపీ చేరడంపైనా కదా. పైగా కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా చెప్పారంటే ఇక ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఖాయమని తేలిపోయినట్టే.
ఇంతకీ ఏపీలో కనీసం 1 శాతం కూడా బీజేపీ ఓటు బ్యాంకు లేదు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 0.98 శాతం ఓట్లు వచ్చాయి.కానీ ఆ పార్టీ చుట్టూనే టీడీపీ, జనసేన, వైసీపీ తిరుగుతున్నాయి. ఏపీలో బీజేపికి ఈ మూడు పార్టీలో ప్రత్యక్షంగానే, పరోక్షంగానో మిత్రపక్షాలేకానీ విపక్షాలు కావు. వచ్చే ఎన్నికల్లోనే అదే పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి.