Women Attack on TSRTC Conductor in Hyderabad(TS today news): హైదరాబాద్ లోని ఆర్టీసీ సిటీ బస్ సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్ని దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా తాను దిగాల్సిన చోట బస్సు ఆపలేదని ఆగ్రహించిన ఓ మహిళ కండక్టర్ను చెప్పుతో కొట్టింది.
మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ కండక్టర్ను బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. మెహిదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లే రూట్ నంబర్ 300 బస్సులో ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న.. బస్సులో శివరాంపల్లి వద్ద ఎక్కింది. ఆమె హైదర్గూడ కల్లు కంపౌండ్ ప్రాంతంలో దిగాల్సి ఉండగా బస్సు అత్తాపూర్లో ఆగింది.
అత్తాపూర్ లో దిగిన ప్రసన్న మళ్లీ వెనక్కి వెళ్లేందుకు రోడ్డు దాటి మెహదిపట్నం నుంచి ఉప్పల్ వెళ్తున్న 300 నంబర్ బస్సు ఎక్కింది. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్టాప్లో దిగేందుకు ప్రయత్నించింది. కండక్టర్ ముత్యాల నర్సింహ ఆమెను ఎక్కడ దిగాలని అడిగారు. ఒక్క సారిగా ఆగ్రహానికి లోనైన ప్రసన్న మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ బూతులు తిట్టింది.
కండక్టర్ ను చెప్పుతో కొట్టింది. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని బస్సును రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే బస్సు పీఎస్ వద్ద ఆగగానే ఆమె అక్కడి నుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.