Telangana Budget 2024 updates(Breaking news in telangana): తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు పడ్డాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టింది. 6 గ్యారంటీలకు రూ.53,196 కోట్లు నిధులు కేటాయించింది. బడ్జెట్ దాదాపు 20 శాతం నిధులు ఈ 6 పథకాలకే కేటాయింపులు చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేసేలా నిధులు కేటాయింపులు జరిగాయి.
పేదల సంక్షేమం..
ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయింపు చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు ,బీసీ సంక్షేమానికి 8 వేల కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు ప్రతిపాదించారు. అంటే 45 వేల కోట్ల పైనే ఈ వర్గాలకోసం కేటాయింపులు చేశారు. అంటే బడ్జెట్ దాదాపు 15 శాతం పైగా నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కేటాయించారు.
దళిత బంధు..
గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన దళితబంధుకు నిధులు కేటాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లో విఫలమైనా దళిత బంధుకు 17,700 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించారు.
Read More: తెలంగాణ బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు.. 6 గ్యారంటీలకు రూ. రూ. 53,196 కోట్లు..
రైతులకు భరోసా..
రైతు రుణమాఫీకి కార్యచరణ రూపొందిస్తామని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతు బంధును ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో సాగు దన్నుగా నిలిచే విధంగా కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు ప్రతిపాదించారు.
ఇందిరమ్మ ఇళ్లు..
పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు పథకానికి భారీగా నిధులు కేటాయించింది.
గృహ నిర్మాణశాఖకు రూ.7,740 కోట్లు కేటాయింపులను ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.
ఉచిత విద్యుత్..
గృహజ్యోతి పథకానికి తెలంగాణ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించారు.200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేసేందుకు అడుగులు వేసింది. గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు కేటాయించింది.