Mithun Chakraborty Admitted in Hospital: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని.. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
ఆయన ఆరోగ్యంపై త్వరలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తరచూ ఆయన ఆరోగ్యంపై అప్డేట్స్ తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఆయన క్షేమంగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
కాగా పశ్చిమ బెంగాల్కు చెందిన 73 ఏళ్ల మిథున్ చక్రవర్తి 80S, 90S లలో హీరోగా బెంగాలి, హిందీ, ఒడిశా, భోజ్పురి, తమిళ్, కన్నడ, పంజాబీలో దాదాపు వందకు పైగా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
READ MORE: Shreyas Talpade : రోజంతా షూటింగ్.. పుష్ప నటుడికి గుండెపోటు
అంతేకాకుండా ఇటీవల రిలీజైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లోనూ నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతోపాటు ‘హునార్బాజ్’ షోకి జడ్జిగా వ్యవహరించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు సుపరిచితమే. ‘గోపాల గోపాల’ సినిమాలో స్వామీజీగా నటించి అందరినీ మెప్పించారు.
ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్లో చేరి 2014లో రాజ్యసభకు వెళ్లారు. అనంతంరం కేవలం రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే.
గతంలోనూ ఆయన కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. రెండేళ్ల క్రితమే ఆయనకు బెంగళూరులోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతి నొప్పి రావడంతో కోల్కతాలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.