BJP-TDP Alliance (telugu flash news) :
ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సర్వేలు, అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సీట్ల సర్దుబాటు చేసుకుంటూ ఉండగా.. టీడీపీ-జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక అజెండాతో ముందుకు వెళ్తోంది.
వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పొత్తుపెట్టుకున్నారు. అయితే.. ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను కలిసి ప్రకటించింది లేదు. దీంతో.. పలుచోట్ల టీడీపీ-జనసేన నేతల మధ్య సీట్ల కోసం వార్ నడుస్తోంది. సీటు తమకంటే తమకంటూ ఇరుపార్టీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పార్టీ అధినేతలు ఇద్దరు సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చారు.
Read More : తారా స్థాయిన ఏపీ రాజకీయాలు.. ఉత్కంఠ రేపుతున్న సర్వేలు
బీజేపీ అధిష్టానంతో తాజాగా చంద్రబాబు చర్చలు జరిపారు. పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి సీట్ల కేటాయింపుపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ వల్ల పెద్దగా లాభం లేదనే అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చినట్లు తెలుస్తోంది.
16 అసెంబ్లీ, 9 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని టీడీపీని బీజేపీ అడిగినట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలోనూ.. తమ అభ్యర్థి ఉండాలని బీజేపీ పట్టుబడినట్లు సమాచారం. అయితే.. బీజేపీకి 4 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేనకి కలిపి 40 అసెంబ్లీ, 7 పార్లమెంట్ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో.. ఎవరెవరి టికెట్లు గల్లంతవుతాయోనని టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
కాగా.. ఇప్పటికే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారితో పాటు.. సిట్టింగులకు కూడా మొండిచేయి చూపడంతో దాదాపు వైసీపీపై సీనియర్ల నుంచి వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. వైసీపీ లో అన్యాయం జరుగుతుందని వాపోతూ.. చాలా మంది పార్టీని వీడి టిడిపి-జనసేన పార్టీల్లో చేరారు. మరికొందరు నేతలు సైతం పార్టీని వీడే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేని విషయంలో వైసీపీ మొండిగానే వ్యవహరించింది. ఆయన సపోర్ట్ ఉన్న మాగుంటను కాదని, మరొకరిని ఒంగోలుకు ఇన్చార్జ్ గా ప్రకటించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. బుజ్జగింపులతో బాలినేని కాస్త తగ్గారు. గెలుపు అవకాశాలున్న సిట్టింగులకు నియోజకవర్గాలు మార్చడం, మరికొందరికి సీటే ఇవ్వకపోవడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ఓటమి తథ్యమని భావించే.. వైసీపీ ఇన్చార్జులను మార్చిందని.. తర్వాత అభ్యర్థుల మార్పే ఓటమికి కారణమని చెప్పుకునేందుకే ఇలా చేస్తుందన్న వాదనలు లేకపోలేదు.