Pre- Wedding Shoot in Government Hospital in Karnataka: ఒకప్పుడు పెళ్లి అంటే ముహూర్తానికి మూడుముళ్లు పడే దాకా పెళ్లి జంట ఒకరిని ఒకరు కలవడం కాదు కదా.. ఒకరిని ఒకరు సరిగ్గా చూసుకునే వారే కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో పెళ్లికి ముందే జంటలు కొండా.. కోనల్లో తిరుగుతూ ఫోటోలు వీడియోలతో సందడి చేస్తున్నారు.
సినిమాలను మించే సెటప్లు, ఫోటో గ్రాఫర్స్, ప్రత్యేకంగా కొరియో గ్రాఫర్స్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ కొందరు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పేరుతో చేస్తున్న పనులకు నవ్వాలో.. ఏడవాలో తెలియక జనాలకు పిచ్చెక్కుతుంది. ఇంలాంటి ఓ వింత ఫోటో షూట్ కర్ణాటకలో జరిగింది. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ను ఏర్పాటు చేశాడు.
ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు తన కాబోయే భార్యతో కలిసి వీడియోలు, ఫోటోలు తీయించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అభిషేక్ కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతనికి ఒక అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది.
దీంతో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వినూత్నంగా ఆలోచించి.. తాను పనిచేసే ఆస్పత్రినే వేదికగా చేసుకోవాలని భావించాడు. ఏకంగా ఆపరేషన్ థియేటర్లోనే షూట్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామితో కలిసి ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
Read More:Car Driving Video: ఓరినీ పాసుగాల.. ఏం డ్రైవింగ్ రా.. అది!
దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్ స్పందించారు. ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రజలకు వైద్య సేవలు అందజేయడమే ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని, వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని మంత్రి స్పష్టం చేశారు. వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని మరచి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఆరోగ్య సంరక్షణ విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది తమ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ట్వీట్ ద్వారా సూచించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా నడుచుకోవాలని హెచ్చరించారు. సామాన్య ప్రజల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.