Mahashivaratri Brahmotsavam in Srisailam : ప్రఖ్యాతిగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగం.. అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రం.. మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి, ఆలయ ఛైర్మన్, ఈవోతో పాటు నలుగురు జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్ శ్రీనివాసులు. ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. పాతాళగంగలో తాత్కాలిక టాయిలెట్లు, డ్రెస్సింగ్ గదుల ఏర్పాటు చేయాలన్నారు. శివరాత్రి ఉత్సవాలకు శ్రీశైలం క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో రానుండటంతో.. ఏపీ నుంచి 500 బస్సులు, తెలంగాణా నుంచి 450 బస్సులు, కర్ణాటక నుంచి 170 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు తెలిపారు.
Read More : రాహువు స్థానం.. ఆ రాశులనే ప్రభావితం చేస్తుందా?
ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్డుకు ప్యాచింగ్, మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో అటవీ మార్గంలో భారీ వాహనాలను అనుమతించకూడదన్నారు. భారీ వాహనాలను డైవర్ట్ చేసే విధంగా.. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రచారం చేయాలని ట్రాఫిక్ డిఎస్పీలను ఆదేశించారు జిల్లా కలెక్టర్. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు రోజుకు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు అధికారులు. భద్రతలో భాగంగా ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతో పాటు అదనంగా మరో 75 సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు.. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు.. స్వామి, అమ్మవార్ల దర్శనం సులతరం చేసేందుకు నాలుగు రకాల ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మార్చి 1 న శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మార్చి 3న శ్రీదుర్గామల్లేశ్వరి దేవస్థానం నుంచి.. 4న కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంతో పాటు తిరుమలతిరుపతి దేవస్థానం నుంచి.. మార్చి 5న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. మార్చి 8 మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ప్రభోత్సవం..రాత్రికి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం.. అర్ధరాత్రి 12 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 9వ తేదీ సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవంతో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Read More : ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది..? భారత్ లో కనిపిస్తుందా..?
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రఘవీరారెడ్డి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం శ్రీశైలం క్షేత్రంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో దాదాపు 5 వేల వాహనాలు నిలిపే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ సమస్యలు, వాహనాల రాకపోకలను..కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించే అన్నిశాఖల అధికారులు పోలీసులకు సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ. పాగాలంకరణ ముగిసిన వెంటనే రావాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.