Road Accident In Nellore(AP news today telugu): నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు, ఓ బస్సు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 15 మందికి పైగా గాయపడ్డారు. జిల్లాలోని కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ముందుగా ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వస్తోన్న మరో లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తోన్న ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొట్టడతంతో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతుల్లో రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారిని నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే.. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మృతులు, క్షతగాత్రుల బంధువులు 9440796383 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..