Speaker Om Birla warned (india today news):
లోక్సభలో ఒక సమస్యపై చర్చ జరిగేటప్పుడు సంస్థల పేర్లు ప్రస్తావించకూడదని స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సభ్యులను హెచ్చరించారు. ఇక్కడ ఎంపీలు విధానపరమైన విషయాలను మాత్రమే చర్చించాలని సూచించారు.
వాదనల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే మెడికల్ కాలేజీ సమస్య, అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు గురించి మాట్లాడారు. దీనిపై స్పీకర్ పైవిధంగా స్పందించారు. ఏదైనా సమస్య లేవనెత్తేటప్పుడు ఎవరూ ఏ సంస్థ పేరును తీసుకురావద్దని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. అలా ప్రవర్తిస్తే అది పార్లమెంటరీ విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందన్నారు. ఈ పద్ధతి సరైనది కాదన్నారు.
ఏదైనా మెడికల్ కాలేజీలో వివిధ కోర్సులకు గుర్తింపు ఇచ్చే విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య కళాశాలలు 350 నుంచి 700కు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 100 శాతం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 126 శాతానికి పైగా సీట్లు పెరిగాయన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనేదే తమ లక్ష్యమని మంత్రి అన్నారు.