Prasadam of Srisailam Temple: శంభో శంకరా.. కాపాడవయ్య అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ భక్తులు శ్రీశైలం శివాలయాలకు వెళ్తుంటారు.. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో శుక్రవారం అపచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగినట్లు కన్పించడంతో ఒక్క సారిగా షాక్ అయ్యాడు.. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు భక్తుడు తెలుసుకొని షాక్ కు గురి అయ్యాడు.
ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావటం కలకలం రేపుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి కి చెందిన ఓ వ్యక్తి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లాడు. ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి ప్రసాదం తీసుకున్న భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది.
అది చూసిన హరీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన ప్రాంతంలో ఏంటి ఈ అపచారం అంటూ.. ఎముక ఫోటోను యాడ్ చేసి ఓ లేఖను కూడా రాసి పంపాడు. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అతనికి చాలా భక్తులు కూడా మద్దతుగా నిలిచినట్లు సమాచారం.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.