Bharat Ratna Awards Given By Modi & Vajpayee: మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురు ప్రముఖులకు భారత్ రత్న అవార్డు ప్రకటించారు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ఇలా యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. అటు అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇలా భిన్న వ్యూహాలతో మోదీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. హ్యాట్రిక్ విజయమే టార్గెట్ గా పెట్టుకున్నారు.
15 రోజుల వ్యవధిలో ఐదుగురు ప్రముఖులకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను మోదీనే స్వయంగా ప్రకటించారు. వారిలో మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ ఉన్నారు. వారితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు ఈ గౌరవం దక్కింది.తాజాగా పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్నను మోదీ ప్రకటించారు. రెండు వారాల క్రితం ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్కు భారత రత్నను ప్రకటించారు.
వాజ్ పేయీ హయాంలో..
1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అత్యధికంగా నలుగురు ప్రముఖులకు భారత రత్న పురస్కారం ప్రకటించింది. ఒకే ఏడాది నలుగురికి భారత రత్న ప్రకటించడం అదే తొలిసారి. అప్పుడు జయ ప్రకాష్ నారాయణ్, అమర్త్యసేన్, గోపీనాథ్ బోర్డోలోయ్, పండిట్ రవి శంకర్ కు భారత్ ప్రదానం చేశారు. ఇప్పుడు ఏకంగా ఐదుగురికి మోదీ ప్రకటించి రికార్డు బ్రేక్ చేశారు.
మోదీ హయాంలో..
2015లో అటల్ బిహారీ వాజ్పేయి, మదన్ మోహన్ మాలవీయ, 2019లో ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికీ భారత్ రత్న ఇచ్చారు.
2024లో కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అడ్వాణి, చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, డాక్టర్ ఎం.ఎస్.స్వా మినాథన్ కు పురస్కార్ ప్రకటించారు.
భారత రత్న నిబంధనలు..
భారత రత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. ఏదైనా రంగంలో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. ఒక కేటగిరీలో ఒకేసారి ముగ్గురి కంటే ఎక్కువ మందికి భారత రత్న అవార్డు ఇవ్వకూడదు. రాజకీయాలు, కళలు, సాహిత్యం, సైన్స్ రంగాలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక సేవకులకు భారత రత్న అవార్డు ఇస్తారు.
‘భారతరత్న’ పురస్కారాన్ని 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకట రామన్లకు తొలిసారిగా 1954లో ఈ గౌరవం దక్కింది.