MS Swaminathan in Harithaviplava research: హరిత విప్లవంతో భారత వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చేసిన శాస్త్రవెత్త, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్కు తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందంటారు. భారతీయులకు దాన్ని సార్థకం చేసి పెట్టిన వ్యక్తి దివంగత ఎం.ఎస్. స్వామినాథన్.
భారత దేశ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన హరిత భగీరథుడు ఆయన . ధాన్యం నిల్వల్లో భారత్ స్వయంసమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం స్వామినాథనే.. ఆయన చేసిన పరిశోధనలు, తీసుకొచ్చిన మార్పులే. హరిత విప్లవంతో భారత పంట పొలాల ముఖచిత్రం పూర్తిగా మార్చివేశాయి.
పాడి పంటలే దేశ ప్రగతికి నిజమైన గీటురాళ్లని స్వామినాథన్ నమ్మారు. అందుకే.. ఆయన్ని భారత హరిత విప్లవ పితామహుడనిగా భారత్ గొప్పగా కీర్తించుకుంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతరత్నం పురస్కారంతో గౌరవించడం యావత్ దేశం మొత్తం గర్వించదగ్గ విషయం.
క్షామాన్ని చూసి చలించిన స్వామినాథన్..
మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7న జన్మించారు. అతనికి 15 ఏళ్లు నిండకముందే తండ్రి చనిపోవటంతో అప్పటికే కుటుంబం నిర్వహిస్తున్న ఆసుపత్రిని చూసుకొనేందుకు వైద్య విద్య చదవాల్సి వచ్చింది. విద్యార్థిగా బెంగాల్లో దారుణ క్షామాన్ని చూశారు స్వామినాథన్. ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి ఉండకూడదని తపించారు.
స్వామినాథన్ వైద్యవృత్తిని చేపట్టబోనని కుటుంబానికి తేల్చి చెప్పి కోయంబత్తూరులోని మద్రాసు అగ్రికల్చర్ కాలేజీలో చేరారు. ప్రిన్సిపాల్ పిలిచి మంచి మార్కులు వచ్చాయి. అనవసరంగా ఈ కోర్సులో ఎందుకు చేరాలనుకుంటున్నావు? అని స్వామినాథన్ను ప్రశ్నించారు. ఆ సమయంలో అగ్రికల్చర్ కోర్సు చదవటమనేది నామోషీగా భావిస్తున్నారన్నారు. అందుకే ఆ భావనను తొలగించేందుకే తాను అగ్రకల్చర్ కోర్సులో చేరుతున్నానంటూ స్వామినాథన్ ప్రిన్సిఫల్ కు బదులు చెప్పారట .
ఐపీఎస్ వద్దనుకొని.. అగ్రికల్చర్ వైపు..
1944లో మొదలైన స్వామినాథన్ వ్యవసాయ విద్యా ప్రస్థానం- జెనెటిక్స్లోకి, పంటలు, దిగుబడుల మెరుగుదల వైపు సాగింది. చీడపీడలను తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను తయారుచేస్తే రైతులకే కాకుండా యావత్ మానవాళికి మేలు జరుగుతుందనే తపనతో స్వామినాథన్ అడుగులు వేశారు. పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఐపీఎస్కు ఎంపికయ్యారు. కానీ, ఫెలోషిప్పై హాలెండ్లో వ్యవసాయ విద్యలో ఉన్నత చదువుకు అవకాశం రావడంతో అటువైపే మొగ్గు చూపారు.
Read More: బహుముఖ ప్రజ్ఞాశాలి.. దేశ గతిని మార్చిన రాజనీతిజ్ఞుడు..
స్వామినాథన్ బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధన చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అక్కడే మంచి జీతంపై అధ్యాపక పోస్టు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. 1954లో కటక్లోని ‘కేంద్ర వరి పరిశోధన సంస్థ’లో చేరి, తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థకు మారారు.
హరిత విప్లవానికి బీజం వేసిన స్వామినాథన్..
స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో ప్రతి ఏడాది 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. విదేశాల నుంచి సరకులు వస్తేగానీ పొట్ట నిండని పరిస్థితి దేశంలో నెలకొంది. అమెరికా నుంచి గోధుమలను భారీగా దిగుమతి చేసుకునేవాళ్లం. 1960 ఆరంభంలోనూ దేశంలో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే ఉండేది. వరి దిగుబడి మరింత తక్కువ ఉండేది. 1966లో కరవు కారణంగా కోటి టన్నుల గోధుమల్ని అమెరికా నుంచి తెప్పించుకునేవాళ్లం.
ఆకలితో విలవిలాడుతున్న భారత్ పరిస్థతిని చూసిన స్వామినాథన్.. తన నూతనపు ఆలోచనలతో భారత వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చాలని స్వామినాథన్ నడుం బిగించటంతో హరిత విప్లవానికి బీజం పడింది. అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీని మెరుగుపర్చారు. ట్రాక్టర్ల లాంటి ఆధునిక పరికరాల వాడకం పెరిగింది. సాగునీటి సదుపాయాలు మెరుగుపరచారు. ఎరువులు, పురుగుమందుల వాడకం పెరిగింది. సాగు విస్తీర్ణం పెంచటం ఈ హరిత విప్లవంతోనే సాధ్యం అయ్యింది.
1967-68 నుంచి 1977-78 మధ్య పరిస్థితిలో భారీ మార్పు మొదలైంది. భారత సంప్రదాయ వంగడాలు ఏపుగా పెరిగేవి. సన్నగా పెరిగి గాలికి వాలిపోయేవి. కాస్త తక్కువ ఎత్తుతో దృఢంగా నిలిచి ఎక్కువ దిగుబడి నిచ్చే వరి వంగడాలపై స్వామినాథన్ బృందం పరిశోధనలు చేసింది. కొంతమేరకు సత్ఫలితాలనిచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో గోధుమలపై దృష్టి సారించారు స్వామినాథన్. వరి, గోధుమ తదితర పంటలపై ఆయన జరిపిన విశేష కృషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.
హరితం కాదు సతత హరితం..
హరిత విప్లవం కారణంగా రసాయనాలు, ఎరువుల వాడకం పెరిగి భూసారం తగ్గిందనే విమర్శలనూ స్వామినాథన్ అంగీకరించటం వినమ్రతకు నిదర్శనం. స్థానికంగా ఉండే వంగడాలను కోల్పోవద్దనేవారు. భూసారాన్ని కాపాడుకోకుండా, నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవసాయం చేస్తే ఎడారులను సృష్టించినవారమవుతామని స్వామినాథన్ హెచ్చరించేవారు. హరిత విప్లవం కంటే సతత హరిత (ఎవర్గ్రీన్) విప్లవం కావాలి కోరుకునేవారు.
స్వామినాథన్ కు అవార్డుల పంట..
స్వామినాథన్ కి 1971లో రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. 1986లో రాబర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్, 1991లో ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ వంటి తదితర వందకు మించి పురస్కారాలు పొందారు. దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తాజాగా భారతరత్న సైతం ఆయన్ను వరించాయి. 1987లో ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు 84 గౌరవ డాక్టరేట్లను స్వామినాథన్ కు ప్రదానం చేశాయి. 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా టైం మ్యాగజైన్ గుర్తించింది. 2007 నుంచి 2013 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. స్వామినాథన్ పరిశోధనలు ఎన్నో వంగడాలతో భారత్లో బంగారు పంటలు పండించాయి. చివరి వృద్దాప్యం కారణాలతో చెన్నై తేనాంపేటలోని స్వగృహంలో 2023 సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు.