Shreyas Iyer out from the 3rd Test due to Injury: ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తదుపరి రెండు టెస్టులకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ తర్వాత విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుకి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కే ఎల్ రాహుల్ దూరమయ్యారు.
గాయాలతో సతమతమవుతోన్న టీమిండియాను మరో క్రికెటర్ గాయం కలవరపెడుతోంది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన టాపార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) వెన్ను నొప్పి, గజ్జల్లో గాయంతో మిగతా సిరీస్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో స్టోక్స్ రనౌట్తో ఆకట్టుకున్న శ్రేయాస్ బ్యాటింగ్లో మాత్రం రాణించలేక పోయాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్లో 35, 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ పోరాడి ఓడిపోయింది.
Read More: “పెద్ద తప్పు చేశాను..” విరాట్ కోహ్లీ ఇష్యూపై ఏబీడీ క్షమాపణలు..
ఇక విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 27 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్ బాగా ఆడగలడని పేరున్న అయ్యర్ రెండు టెస్టుల్లో నాలుగు సార్లు స్పిన్ ఉచ్చులో చిక్కుకొని అవుట్ అయ్యాడు.
ఒకవేళ కోహ్లీ మూడో టెస్టుకు అందుబాటులో ఉంటే శ్రేయాస్ పరిస్థితి బెంచ్కే పరిమితమయ్యేదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. విశాఖలో సెకండ్ టెస్టు ముగిశాక అందరి కిట్ బ్యాగులు రాజ్ కోట్కు తరలించగా అయ్యర్ కిట్ బ్యాగ్ మాత్రం తన స్వస్థలం ముంబయికి తరలించారని సమాచారం.
దీంతో అతడి గాయం తీవ్రమైందని మూడో టెస్టుకు అందుబాటులో ఉండడన్న విషయం అర్థమవుతోంది. కానీ గాయంతో దూరమవ్వడంతో ఇప్పుడు టీమ్ సెలక్షన్ గందరగోళంగా మారింది.
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్, ఇండియా చెరో గెలుపుతో సిరీస్ను సమం చేసాయి. ఇక మూడో టెస్టు ఫిబ్రవరి 15-19 వరకు రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 23-27 వరకు జరిగే నాలుగో టెస్టుకు రాంచీ వేదిక కానుంది. ఇక చివరిదైన ఐదో టెస్ట్ మార్చి 7-11 వరకు ధర్మశాలలో జరగనుంది.