PV Narasimha Rao latest news(Telugu news live today): భారత రాజకీయ చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టినా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ఆయన పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు భారత్ రూపురేఖలను మార్చేశాయి. ఇప్పుడు ఎన్నో షార్టప్ లు వస్తున్నాయి. ఉద్యోగావకాశాలు పెరిగాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ, సూక్ష్మరుణాలు, కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల జీవనశైలే మారిపోయింది. ఇలా కొత్త శకానికి నాంది పలికింది పీవీ.
1990 చివరి నాటికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. చమురు అత్యంత ఖరీదైంది. చమురు దిగుమతి చేసుకోవటానికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. అప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు 3 వారాల సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వమే దివాలా తీసే పరిస్థితి ఎదురైంది. రూపాయి మారకం విలువ పతనమైంది. ఎక్కడా అప్పులు పుట్టలేదు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కూడా మొహం చాటేశాయి. చివరికి బంగారాన్ని తనఖా పెట్టి .. ఐఎంఎఫ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వద్ద కొంత సొమ్ము తెచ్చి, అప్పులు తీర్చాల్సిన దుస్థితి.
1991 జూన్ 21న పీవీ నరసింహారావు అనూహ్యంగా ప్రధాని అయ్యారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కటానికి రూపాయి విలువను తగ్గించారు. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఎగుమతులు పెరిగాయి. ద్రవ్య లోటును తగ్గించటంపై దృష్టి పెట్టారు. ఎరువుల రాయితీ తగ్గింపు,చక్కెర రాయితీ రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరణను ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గేందుకు అవకాశం ఏర్పడింది.
వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు ప్రధాని పీవీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ప్రైవేట్ బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించారు. బ్యాంకింగ్ రంగంలో పోటీకి అవకాశమిచ్చారు. స్టాక్మార్కెట్లలో భారీగా మార్పులు తీసుకొచ్చారు. 1992లో సెబీకి చట్టబద్ధత కల్పించారు. పారిశ్రామిక రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. 1991 నూతన పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దాదాపు 80 శాతం పరిశ్రమలకు లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. రైల్వేలు, అణు ఇంధనం, రక్షణ లాంటి 8 రంగాలను మినహా మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఏర్పడింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. ఎన్నో పరిశ్రమల్లో 74% – 100% విదేశీ పెట్టుబడులకు అనుమతించారు.
పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్వోల్బణం అదుపులోకి వచ్చింది. పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. కొద్దికాలానికే సంస్కరణల ఫలాలు అందివచ్చాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. విమాన ప్రయాణం సామాన్యులకు చేరువైంది. రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రైవేట్ రంగం లక్షల ఉద్యోగాలు కల్పించగలిగే స్థితికి ఎదిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉందంటే దానికి పునాది పడింది పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలతోనే అని గుర్తుంచుకోవాలి.
సాహిత్యవేత..
రాజకీయాల్లోకాదు.. సాహితీ రంగంలోనూ పీవీ తనదైన ముద్రవేశారు. తొలుత పద్య ప్రక్రియపై ఆసక్తి చూపించారు. ఆ తర్వాత ఆధునిక కవిత్వం వైపు మళ్లారు. అనేక నవలలు, కథలు రాశారు. అనువాదంపై ఆయనకు ఎంతో పట్టు ఉండేది. అందువల్లే అనేక రచనలు తెలుగులోకి తీసుకొచ్చారు. సాహితీ రంగంలోనూ పీవీ ఎనలేని పేరు, ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు.
దౌత్యనీతి..
పీవీ నర్సింహారావు గొప్ప దౌత్యనీతిని అవలంబించేవారు. నొప్పింపక.. తానొవ్వక.. అన్న చందంగా వ్యవహరించేవారు. ఎదుటి వాళ్లకు సమస్య రాకూడదనే భావించేవారు. మన సమస్య అలాగే ఉండిపోకూడదనే స్పష్టతో ఉండేవారు. ప్రధానిమంత్రిగా ఐదేళ్ల పాలనలో ఆయన విధానంలోనే పనిచేశారు. పాత దౌత్య విధానాలకు స్వస్తి పలికారు. సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అలానే ముందుకు సాగారు. ఆయన వల్లే ఇజ్రాయెల్తో సంబంధాలు బలపడ్డాయి. అమెరికాతో స్నేహం కొత్త పుంతలు తొక్కింది. దాయాదులను దాడి చేయకుండా దారికి తెచ్చారు. ద టీజ్ పీవీ.
పదవులకు వన్నె..
పదవులకే పీవీ వన్నెతెచ్చారు. తరతరాలు గుర్తుండిపోయేలా పాలించారు. ఆయన పదవి చేపట్టే నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ ముగినిపోయే నావలా ఉంది. ఆ క్లిష్ట పరిస్థితులను సంస్కరణలతో దాటారు. దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టారు. తన మార్క్ పాలనతో దేశ పారిశ్రామిక గతిని మార్చేశారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పీవీ నరసింహారావు పాత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే.