Maldives in the Indo-Pacific:
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక భాగస్వామి అని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకు వెల్లడించింది. మాల్దీవులతో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని పేర్కొంది. స్వేచ్ఛాయుత, సురక్షితమైన ఇండో-పసిఫిక్లో మాల్దీవులు కీలక భాగస్వామి అని తెలిపింది. జనవరి 29-31 తేదీల మధ్య అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ మాల్దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలను కోరగా అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఈ అంశాన్ని వెల్లడించారు.
తన పర్యటనలో భాగంగా లూ మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో భేటీ అయ్యారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొన్నది. రక్షణ సహకారం, ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్య పాలన వంటి అంశాలు చర్చకు వచ్చాయని తెలిపింది. మాల్దీవుల్లో అమెరికా దౌత్య కార్యాలయం ఏర్పాటుపై చర్చించినట్లు వెల్లడించింది.
అది ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికేనని తెలిజేసింది. ఈ ఆలోచన ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నది. ఆ తర్వాత డొనాల్డ్ లూ అక్కడి పౌరసమాజ ప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పాలన, పారదర్శకతపై చర్చలు జరిపినట్లు వెల్లడించింది.
Read More: తొలి తెలుగు భారతరత్నం.. ఇన్నాళ్లుకు పీవీకి దక్కిన గౌరవం..
భారత్-మాల్దీవుల మధ్య దౌత్య ఘర్షణ చోటు చేసుకున్న సమయంలో అమెరికా నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. తాజాగా భారత్ మాల్దీవుల్లోని సైనిక సిబ్బందిని వెనక్కి పిలిపించి. ఆ స్థానంలో సాంకేతిక సిబ్బందిని భర్తీ చేయాలని భారత్ నిర్ణయించింది.
మరోవైపు భారత్తో వివాదం కారణంగా ముయిజ్జుపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని అక్కడి సుప్రీం కోర్టు నిలిపివేసింది. అధ్యక్ష, ఉపాధ్యక్షుల అభిశంసనకు పార్లమెంటు సభ్యుల్లో రెండింట మూడొంతుల(2/3) మెజారిటీ అవసరమని రాజ్యాంగం నిర్దేశించింది.