P. V. Narasimha Rao Political Career and Turning Point: అది 1939వ సంవత్సరం. 18 ఏళ్ల యువకుడు జాతీయోద్యమ నినాదాన్ని అందుకున్నాడు. తెలంగాణ నుంచి త్రిపురకు వెళ్లాడు. కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యాడు. ఆ సభలో ప్రముఖుల ప్రసంగాలు ఆ టీనేజ్ కుర్రాడిలో చైతన్యం నింపాయి. రాజకీయాలపై ఆసక్తిని పెంచాయి. నాటి ఆ యువకుడే దేశ ప్రధాని అయ్యాడు. అతనెవరో కాదు తెలుగుతేజం పీవీ నర్సింహారావు(P.V Narasimha Rao). ఇలా 1939వ సంవత్సరం పీవీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసింది. చదువుకుంటూనే రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు.
ఒక దశలో పీవీ తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. న్యాయవాదిగా స్థిరపడాలా? రాజకీయాల్లో కొనసాగాలా? ఈ రెండు ప్రశ్నలు ఆయన ముందున్నాయి. చివరికి రాజకీయాల్లోనే కొనసాగాలని భావించారు. 30 ఏళ్ల వయస్సులో 1951లో క్రీయాశీలక రాజకీయాల్లోకి పీవీ అడుగులు వేశారు.
మంథని ఎమ్మెల్యేగా..
1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పీవీకి పదవి దక్కింది. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శి పదవి చేపట్టారు. ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారి ఓటమిని ఎదుర్కొన్నారు.
1952 లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. అయినా వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత మంథని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955-1977 వరకు దాదాపు 22 ఏళ్లు మంథని ఎమ్మెల్యేగా కొనసాగారు.
Read More: తొలి తెలుగు భారతరత్నం.. మాజీ ప్రధానికి అత్యున్నత పురస్కారం
సీఎం పదవి..
పీవీని ఎన్నో పదవులు వరించాయి. 1958-60 వరకు పబ్లిక్ అకౌంట్ సభ్యుడిగా పనిచేశారు. 1960-61లో విద్యా ప్రాంతీయ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1962-64లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నీలం సంజీవరెడ్డి కేబినెట్ లో న్యాయ, జైళ్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 1964-67 వరకు అధికార భాషా సంఘం సభ్యుడిగా విధులు నిర్వహించారు. 1967లో అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్ లో హెల్త్ మినిస్టర్ గా, 1968-71 మధ్య ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేశారు.
1971-73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగానూ పీవీ నర్సింహారావు పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం రద్దయిపోయింది. ఈ పరిణామాల తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి పీవీ తప్పుకున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కేంద్ర పాలిటిక్స్ పై పీవీ ఫోకస్ పెట్టారు. 1974లో ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
ఎంపీ నుంచి పీఎం వరకు ప్రస్థానం…
పీవీ 1977లో హనుమకొండ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచారు. 1978లో పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్గా నియమితులైయ్యారు. 1980-84 వరకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1984లో కేంద్ర ప్రణాళిక మంత్రిగా, ఆ తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1985లో రక్షణ మంత్రిగా పనిచేశారు.
1985-88 వరకు మానవ వనరుల శాఖమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు అప్పడే ప్రారంభమైంది. 1988లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
ప్రధానిగా పీవీ..
1989లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. అప్పుడు పీవీ క్రీయాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన 1991 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పీవీ పేరు తెరపైకి వచ్చింది. అప్పుడు ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1991 జూన్ 20 ప్రధానిగా పీవీ నర్సింహారావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఢిల్లీ గద్దెపై తెలుగు పెద్ద..
ఢిల్లీ గద్దెపై ప్రధానిగా తెలుగు పెద్ద కొలువయ్యారు. తొలిసారి తెలుగు వ్యక్తి ప్రధాని పదవి చేపట్టారు. అయితే 1991 సాధారణ ఎన్నికల్లో పీవీ పోటీ చేయలేదు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత 1991లోనే నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించారు. పీవీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేకున్నా ఐదేళ్లపాటు కొనసాగింది. 1996లో ఒడిశాలోని బరంపురం నుంచి ఎంపీగా పీవీ విజయం సాధించారు.