Pollution: దేశంలోకే అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరం ఢిల్లీ. ఇప్పుడిది ఓల్డ్ న్యూస్. ఎయిర్ పొల్యూషన్ లో ఢిల్లీని దాటేసింది బీహార్. ఇది లేటెస్ట్ అప్ డేట్. బీహార్ లోని ‘కతిహార్’ సిటీ 360 పాయింట్లతో దేశంలోకే కాలుష్య నగరంగా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఢిల్లీ 354 పాయింట్లో రెండవ స్థానానికి మెరుగు పడింది. సీఎం కేజ్రీవాల్ తీసుకుంటున్న పలు డైనమిక్ నిర్ణయాలతో రాజధాని నగరం గాలి నాణ్యతలో కాస్త మెరుగుపడినట్టుంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు-CPCB నివేదిక ప్రకారం కతిహార్, ఢిల్లీల తర్వాత నోయిడా (328), ఘజియాబాద్ (304), బెగుసరాయ్, బల్లాబ్ఘర్, ఫరిదాబాద్, కైతాల్, గుడ్గావ్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లు వరుసగా అత్యంత కాలుష్య నగరాలుగా సీపీసీబీ ప్రకటించింది. మొత్తం 163 నగరాల గాలి నాణ్యత ప్రమాణాలను ప్రకటించగా.. ఆ జాబితాలో పలు తెలుగు రాష్ట్రాల నగరాలు కూడా ముందు వరుసలో ఉండటం ఉలిక్కిపడాల్సిన విషయం.
పొల్యూషన్ టాపిక్ వచ్చినప్పుడల్లా.. అది ఢిల్లీ సమస్య మాత్రమేనని మనకేం సంబంధం లేనట్టుగా ఉంటారు ఇక్కడి వాళ్లు. కానీ, పొల్యూటెడ్ సిటీస్ లో మన నగరాలు కూడా ఉండటం అలర్ట్ అవ్వాల్సిన అంశం. ఇంతకీ ఏపీ, తెలంగాణలో ఎక్కడ గాలి కాలుష్యం అధికంగా ఉంది? ఏపీలోనా? తెలంగాణలోనా?
అంతా హైదరాబాదే పొల్యూటెడ్ సిటీ అనుకుంటారు. కానీ, భాగ్యనగరాన్ని మించి గాలి కాలుష్యం విశాఖపట్నంలో ఉందని సీపీసీబీ నివేదిక చెబుతోంది. 202 పాయింట్లతో విశాఖ అత్యంత కాలుష్య నగరంగా నిలవగా.. 100 పాయింట్లతో హైదరాబాద్ చాలా బెటర్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్ పెద్ద నగరమే అయినా.. విశాఖలో ఇండస్ట్రీలు ఎక్కువ. అందుకే అక్కడ గాలి కాలుష్యం కూడా అధికమే అంటున్నారు. అనంతపురంకు 145 పాయింట్లు రావడం అవాక్కయ్యే విషయమే. తిరుపతి, రాజమహేంద్రవరం, ఏలూరు నగరాలు కూడా CPCB జాబితాలో చేరాయి.