Attack on Dalit Women In Kamareddy: సహజీవనం చేస్తున్న జంటపై విచక్షణారహితంగా మొదటి భార్య, ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. వీరిని పూర్తిగా వివస్త్రలను చేసి ప్రైవేట్ భాగాలపై కారంపొడి చల్లుతూ దాడి చేశారు. “నా భర్తను విడిచిపెట్టి పోతావా లేదా” అంటూ వారిద్దరినీ గద్దిస్తూ యువతి బట్టలు విప్పి ప్రైవేటు పార్ట్లపై కారంపొడి చల్లుతూ.. కర్రలతో కొడుతూ హింసకు పాల్పడ్డారు.
ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అదే గ్రామానికి చెందిన సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఓ బాబు ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత విడాకులు ఇచ్చినట్లు సమాచారం.
అనంతరం నరేష్ కూలి పనులు చేసుకునేందుకు రామారెడ్డి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లో పనికి చేరాడు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన దళిత యువతి స్రవంతితో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. తనను వదిలివెళ్లిన భర్త నరేష్ గురించి సంధ్య ఆరా తీయగా రామారెడ్డి మండల కేంద్రంలో ఉంటున్నట్లు తెలుసుకుంది.
అక్కడికి వెళ్లి చూడగా.. అదే సమయంలో నరేష్, స్రవంతిలు ఒకే గదిలో కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేష్ భార్య సంధ్య, కుటుంబ సభ్యులు, కుల పెద్దలతో కలిసి వారిద్దరిని వివస్ర్తలు చేసి చితకబాదారు. రామారెడ్డికి వెళ్లి వారిని బంధించి ఇద్దరి బట్టలను విప్పి ప్రైవేట్ పార్ట్లో కారంపొడి చల్లి, కర్రలతో దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన వారిద్దరిని కారులో అక్కాపూర్ గ్రామానికి తీసుకువచ్చి గాంధీ విగ్రహం దగ్గర కట్టేశారు.
ఉదయం వరకూ అక్కడే ఉంచి.. ఆ తర్వాత కట్లు విప్పారు. స్పృహలోకి వచ్చిన వారిని బెదిరించారు. ఎవరికైనా ఈ విషయం చెబితే.. ఎక్కడికి వెళ్లినా కత్తితో పొడిచి చంపేస్తామని హెచ్చరించారు. దాంతో భయపడిన స్రవంతి, నరేష్ లు జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అది నా పరిధి కాదంటూ పట్టించుకోకపోవడం శోచనీయం. గ్రామ పెద్దలు కూడా కొంత డబ్బు తీసుకొని సైలెంట్గా ఉండిపోయారని సమాచారం. పోలీస్ అధికారులు ఇప్పటి వరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దళిత అమ్మాయిని వివస్త్రను చేసి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటనపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.