Shivsena UBT Leader Shot in Facebook Live : సోషల్ మీడియా లైవ్ లో సూసైడ్ ను చాలాసార్లు చూసే ఉంటారు. ఫేస్ బుక్ లైవ్ లో ఒక వ్యక్తి హత్యకు గురవ్వడం చూశారా ? ఇదేమీ ప్రాంక్ వీడియో కాదు. నిజంగానే ఫేస్ బుక్ లైవ్ లో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శివసేన నేత దారుణహత్యకు గురయ్యారు. శివసేన నేత అభిషేక్ ఘోసాల్కర్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా.. స్థానిక సామాజిక కార్యకర్త మౌరిస్ నోరాన్హ అతనిపై తుపాకీతో కాల్పులు జరిపి.. హతమార్చాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబై లో జరిగింది.
Read More : ‘కడైసి వివాహాయి’ నటి కాసియమ్మాళ్ దారుణ హత్య.. కొడుకే హంతకుడు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన (Sivsena UBT) వర్గానికి చెందిన అభిషేక్ గతంలో కార్పొరేటర్ గా పనిచేశాడు. అతని తండ్రి వినోద్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. స్థానిక ఉద్యమకారుడైన నోరాన్హ, అభిషేక్ ల మధ్య కొంతకాలంగా వ్యక్తిగత వైరం ఉంది. ఈ క్రమంలో ముంబైలోని బొరివిల్లీ ప్రాంతంలో ఉన్న ఐసీ కాలనీ అభివృద్ధి పనుల గురించి మాట్లాడేందుకు నోరాన్హ తన కార్యాలయానికి అభిషేక్ ను ఆహ్వానించాడు. అక్కడికెళ్లిన అభిషేక్.. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగానే మౌరిస్ తుపాకీతో కాల్పులు జరిపాడు.
అభిషేక్ కు పొట్ట, భుజంలోకి తూటాలు దూసుకెళ్లడంతో.. అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అభిషేక్ మరణించాడు. అభిషేక్ పై కాల్పులు జరిపిన అనంతరం నోరాన్హ తనని తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా ఫేస్ బుక్ లైవ్ లో రికార్డైంది. దాని ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More : ఢిల్లీలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై కుప్పకూలిన మెట్రో ప్లాట్ ఫారమ్..
కాగా.. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా స్పందించాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు.