TDP Jana Sena alliance fight(AP politics): అనకాపల్లి ఎంపీ సీటుపై జనసేన, టీడీపీల మధ్య పెద్ద పంచాయతీనే నడుస్తోంది. కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధే పోటీలో ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగింది. మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు అక్కడ బరిలో ఉంటారని ఫోకస్ అవుతోంది. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా ఓడిపోయిన నాగబాబు.. ఈ సారి ఎంపీగా పోటీ చేసి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారంటున్నారు. అయితే సడన్గా స్థానిక టీడీపీ నేత దిలీప్ ఈ సారి టీడీపీ ఎంపీ టికెట్ తనదే అని హడావుడి మొదలుపెట్టారు. ఇప్పటికే టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు కుమారుడు అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ జరుగుతున్న హడావుడి మిత్రపక్షాల కేడర్ని గందరగోళంలోకి నెట్టేస్తోందంట.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనకాపల్లి ఎంపీ సీటు కాక రేపుతోంది. అటు వైసీపీ ఎంపీ అభ్యర్ధి కోసం వెతుక్కుంటుంటే.. ఇటు జనసేన, టీడీపీలు సీటు మాదంటే మాదని పంతాలకు పోతూ.. హడావుడి చేస్తున్నాయి. కాపు, గవర సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్న అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పొత్తుల సర్దుబాటులో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుండి అనకాపల్లి ఎంపీగా తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారు.
ఇటీవల బడా వ్యాపారవేత్త అయిన దిలీప్ చక్రవర్తి టీడీపీ అధినేత చంద్రబాబు, పాటీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లతో తరచూ భీటీ అవుతున్నారు. ఆయన తనకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలెట్టేశారు. జనసేన స్టేట్ కో ఆర్డినేటర్గా పనిచేసిన దిలీప్ చక్రవర్తి.. పొత్తుల లెక్కలతో టీడీపీ టికెట్ రేసులోకి రావడం ఆసక్తి రేపుతోందిమరోవైపు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్ని అనకాపల్లి ఎంపీ బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇటీవల మాడుగులలో జరిగిన చంద్రబాబు సభలో.. అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ్కి ఎంపీ సీటు ఇవ్వాలని, ప్రజలు ఆశీర్వదించాలని.. ఓపెన్గానే తన మనసులో మాట చెప్పేశారు .. దాంతో టీడీపీలో ఎంపీ సీటు కుమ్ములాట మొదలైంది.
అంత వరకు బాగానే ఉన్నా అనకాపల్లిలో గవర సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీని వీడీ జనసేనలో జాయిన్ అవ్వడంతో ఈక్వేషన్స్ మారిపోయినట్లు కనిపించాయి. అనకాపల్లి మాజీ ఎంపీ అయిన కొణతాల రామకృష్ణ ఈ సారి జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తారని భావించారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం రానున్న ఎన్నికల్లో తాను పోటీలో లేనని.. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితే పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి, స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపడానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు.
గత రెండు రోజులుగా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శి, మెగా సోదరుడు కొణిదెల నాగబాబుని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని జనసేన నాయకులు పట్టుపడుతున్నారు. యలమంచిలి జనసేన నేత సుందరపు సతీష్ కుమార్తో పాటు ఉత్తరాంధ్ర జనసైనికులు అనకాపల్లి నుండి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారంట.. ఆ క్రమంలో తాజాగా విశాఖ వచ్చిన నాగబాబు అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట నాయకులతో చర్చలు జరిపారు.
కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్సభ నుంచి పోటీలో ఉంటే.. వారు నమ్మకంగా ఆదరిస్తారని.. గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని జనసైనికులు నాగబాబుకు సూచించారంట.. అదీకాక పవన్ కళ్యాణ్ గాజువాక, భీమిలిల నుండి పోటీ చేయనని తేల్చి చెప్తున్నారు. ఆయన కాకినాడ, పిఠాపురం, భీమవరం, తిరుపతి, బెజవాడల వైపు చూస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పార్టీకి ఊతమిచ్చేలా.. అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును ఒప్పించడానికి జనసైనికులు తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నారు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా బ్రదర్స్ బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని బరిలోకి దింపి… గెలిపించి సత్తా చాటుకోవాలని జనసేనాని అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే నాగబాబు పేరును తెరపైకి తీసుకుని వచ్చి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు, బైరా దిలీప్ చక్రవర్తి టీడీపీ అధినేత దగ్గర పైరవీలు చేసుకుంటుంటే.. జనసేన నాయకులు నాగబాబుని ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా నాగబాబు అక్కడ నుంచి పోటీకి ఓకే అంటే.. టీడీపీ పరంగా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి చూడాలి పొత్తుల లెక్కలు తేలేది ఎప్పుడో?.. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేదెవరో?