Minister Roja vs Gali Bhanu Prakash(Andhra news today): చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు ఎదురు గాలి వీస్తోంది.. అటు వైసీపీ లోకల్ లీడర్లు ఈ సారి ఆమెకు నగరి టికెట్ దక్కకుండా చేయడానికి తాడేపల్లిలో పావులు కదుపుతుంటే.. మరో వైపు వైసీపీ అభ్యర్ధిగా పోటీకి గట్టి కేండెట్ రెడీ అయిపోతున్నారు. ఆ క్రమంలో అక్కడ విచిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. వైసీపీ పెద్దలు రోజాను మార్చి రక్తసంబంధీకుల మధ్య పోటీ పెట్టే పరిస్థితి కనిపిస్తుండటం ఆసక్తికరంగా తయారైంది. అసలు రోజా నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. ఆమెకు చెక్ పెట్టడానికి రేసులోకి వచ్చిందెవరు?
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రోజాకు ఎదురుగాలి వీస్తుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని.. ఐప్యాక్ సర్వే నివేదిక స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నియోజకవర్గంలో మండలానికో అసమ్మతి వర్గం తయారై.. రోజాకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తూ.. ఆమెకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని.. వైసీపీ పెద్దల ముందే తేల్చి చెప్తున్నారంట .
దీంతో అధిష్టానం కూడా ఇక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్ధి కోసం పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ పేరుని దాదాపు ఖరారు చేయడంతో.. ఆయన ప్రచారంలో దూసుకుపోతోంది. దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి.. కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి నియోజవర్గం టీడీపీ ఇన్చార్జ్గా అందరికీ అందుబాటులో ఉంటూ.. పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు.. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భాను ప్రకాష్ అభ్యర్ధిత్వాన్ని బహిరంగంగానే ఖరారు చేశారు. ఇక పార్టీ పరంగా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
వైసీపీలో మంత్రి రోజాకు టికెట్ దక్కదన్న ప్రచారంతో.. చాలామంది ఆశావహులు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. రోజాను తీవ్రంగా వ్యతిరేకించే అసమ్మతి నాయకులు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, అమ్ములు నగరి టికెట్ ఆశిస్తూ పార్టీ
పెద్దలను కలుస్తున్నారు .. అయితే పార్టీ ఆశిస్తున్నంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వారికి లేకపోవడంతో .. వారికి టికెట్ దక్కే అవకాశం లేదంటున్నారు.
నగరి వైసీపీ శ్రేణులు మూడునాలుగు వర్గాలుగా తయారై రోజా అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆ గ్రుపుల్లో గాలి ఫ్యామిలీని ఎదుర్కొనేంత బలమైన నాయకుడు కనిపించరు. దాన్ని అవకాశంగా తీసుకున్న గాలి ముద్దుకృష్ణమనాయుడి రెండో కొడుకు .. గాలి జగదీష్ వైసీపీ టికెట్ రేసులోకి వచ్చారంట. ముద్దు కృష్ణమ నాయుడు మరణం తర్వాత తొలిరోజుల్లోనే భాను ప్రకాశ్, జగదీష్ల మధ్య వారసత్వపు వార్ నడిచింది.. అయితే 2019 భానుకి టీడీపీ టికెట్ ఇవ్వడంతో జగదీష్ సైలెంట్ అయిపోయారు .. ఆ ఎన్నికల్లో ఆయన అన్నకు ప్రచారం కూడా చేయలేదు సరికదా అయన ఓటమికి కృషి చేశారన్న ఆరోపణలున్నాయి.
రానున్న ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన జగదీష్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న టైంలోనే .. లోకేష్ ఈ సారి కూడా భానూదే టికెట్ అని ప్రకటించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన జగదీష్.. టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉండటం మాత్రం ఖాయమని అప్పట్లోనే ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ పెద్దలకు టచ్లోకి వెళ్లిన గాలి వారసుడు.. నగరి నుంచి పోటీకి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారంట. ఆ దిశగా ఆయన సీఎంఓలోని ముఖ్యులను కూడా సంతృప్తి పరిచారంటున్నారు.
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ముందు నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భిన్న ధృవాలుగా ఉంటూ వచ్చారు. రాజకీయంగా విరోధులైనప్పటికీ.. వ్యక్తిగతంగా వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో గాలి జగదీష్కు పెద్దిరెడ్డితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో పెద్దిరెడ్డి ద్వారా గాలి జగదీష్ నగరి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు కూడా జగదీష్కు అనుకూలంగా ఉన్నట్లు నగరిలో ప్రచారం మొదలైంది. అభ్యర్థిత్వం ఖరారు అయిందని.. ప్రకటించడమే లేటని జగదీష్ అనుచరులు అంటున్నారు.
గత ఎన్నికల్లో తన అన్నయ్య భానును ఓడించడంలో జగదీష్ కీలకంగా వ్యవహరించారని.. టీడీపీతో పాటు వైసీపీ శ్రేణులు కూడా అంటుంటాయి. తండ్రితో పాటు గతంలో చాలా కాలం రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్గా తిరిగి ఉన్న జగదీష్ ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కావడంతో.. భానుకు సరైన ప్రత్యర్థి అతనేనని వైసీపీ పెద్దలు భావిస్తున్నారంట. ఇప్పటికే సీఎంఓ ముఖ్య అధికారి ధనుంజయ రెడ్డితో పాటు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సైతం ఓకే అన్నారని చెప్తున్నారు.
మరోవైపు మంత్రి రోజా కూడా తన ప్రయత్నాలు తానే చేస్తున్నారు .. నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాల పెద్దలను కలుస్తూ.. తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు.. ఇప్పటికే బలిజ మొదలియారు, క్షత్రియ సామాజిక వర్గాలనేతలను కలిసి తనకు అనుకూలంగా పనిచేయమని కోరినట్లు తెలుస్తోంది. అయితే గతంలో విజయపురం మండలం క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతకు ఎంపీపీ అధ్యక్ష పదవి దక్కకుండా రోజా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి .. దాంతో ఆ సామాజిక వర్గం చాలా వరకు రోజాకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మొదలియారు సామాజిక వర్గానికి చెందిన పుత్తూరు పట్టణ నాయకురాలికి మొదలియారు కార్పొరేషన్ చైర్మన్ పదవి రాకుండా రోజా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. అది కూడా ఆమెకి ఇప్పుడు ఇబ్బందిగా తయారైందట. దానికి తోడు విపక్షాలపై ధ్వజమెత్తడంలో ఉందుండే రోజా.. తరచూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంటారు. దాంతో రోజాపై బలిజ సామాజిక వర్గం సైతం ఆగ్రహంగా ఉందని చెప్తున్నారు
మొత్తం మీద ఇటు పార్టీలో అసమ్మతితో పాటు.. ఆయా సామాజిక వర్గాలు కూడా రోజాకు వ్యతిరేకంగా ఉండడంతో .. ఆమె ఈ సారి గెలిచే ప్రసక్తే లేదని వైసీపీ సర్వేల్లో తేలిందంట .. దాంతో గాలి జగదీష్ కు అవకాశం కచ్చితంగా వస్తుందని వైసీపీ వర్గాలతో పాటు జగదీష్ వర్గం అంటుంది. అదీకాక సామాజిక సమీకరణలు కూడా జగదీష్కి కలిసి వస్తాయంటున్నారు. రాయలసీమ రాజకీయాల్లో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే పెత్తనం కొనసాగుతూ వస్తోంది .. ఈ సారి కమ్మ వర్గం నుంచి ఒకరికి అవకాశమివ్వాలని చూస్తున్న వైసీపీ.. జగదీష్నాయుడు వైపు మొగ్గు చూపడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అన్నదమ్ముల సవాల్కి నగరి వేదికవ్వనుండటం ఆసక్తికరంగా తయారైంది