KCR did not attend assembly meetings(Telangana politics): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి బీఏసీ సమావేశానికీ వెళ్లలేదు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈరోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశానికి వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి ఎందుకు రాలేదని అధికార పక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లినప్పుడు సహకరించిన ఆరోగ్యం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి సహకరించదా..? అని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ బీఏసీ సమావేశానికి సైతం హాజరు కాలేదు. కేసీఆర్, కడియం శ్రీహరి హాజరవుతారని ముందుగానే పేర్లిచ్చారు. సమావేశానికి మాత్రం ఆయన స్థానంలో హరీశ్ రావు వెళ్లారు. నిబంధనల ప్రకారం ముందు పేర్లిచ్చిన వారే రావాలని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమివ్వగానే ఆయన వెనుదిరిగారు. కావాలనే కేసీఆర్ బదులు హరీశ్ ను పంపారని విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో కేటాయించిన చాంబర్ పై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హోదాను బట్టి నిబంధనల ప్రకారమే చాంబర్ ను స్పీకర్ కేటాయిస్తారు. అదే ప్రకారం కేసీఆర్ కు కేటాయించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరైంది కాదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చాంబర్ కేటాయింపును కూడా రాజకీయం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా ప్రవర్తించడం చర్చకు దారితీస్తుంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు హాజరై ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇష్టారీతిలో వ్యవహరించడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. అధికార పక్ష నేతలు సైతం ఆయన తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికైనా హూందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.