Gruha Jyothi Scheme Telangana(Breaking news in telangana): మాటతప్పం..మడమ తిప్పం అనే విధంగా పాలనలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్. ఉచిత విద్యుత్ సరఫరా కోసం కసరత్తు చేస్తోంది. తొలిదశలో రేషన్ కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబర్ అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్ల ఇళ్లకు.. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తోందట. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు.
ఉచిత కరెంట్ కోసం ప్రజాపాలనలో 81 లక్షల 54 వేల 158 దరఖాస్తులిచ్చారు. వీటిలో 30 శాతం మంది రేషన్కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 30 లక్షల కనెక్షన్లు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. కానీ.. 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులిచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలే లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తు చేయలేదు. వీటన్నిటినీ సరిచూడడానికే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ప్రాథమిక లెక్కలు తేలుతాయి.