Nikki Haley Sensational Comments on India-US Relationship: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న కరోలినా మాజీ గవర్నర్, భారత సంతతి మహిళ నిక్కీ హేలీ.. భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని చెప్పారు. వాస్తవానికి అమెరికాకు భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కానీ అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషంచడంపై మాత్రం వారికి విశ్వాసం లేదని తెలిపారు. అందుకే స్మార్ట్గా ఆలోచించి.. రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని వివరించారు.
అమెరికా తరఫున తాను భారత వ్యవహారాలను సైతం చూశానని గుర్తు చేశారు. అమెరికా నేతృత్వంపై భారత్కు నమ్మకం లేదని, అమెరికా చాలా బలహీనంగా ఉందని ఆ దేశం భావిస్తోందని చెప్పారు.
Read More : Sameer Kamath : సమీర్ కామత్ ది హత్య కాదు.. ఆత్మహత్య
ప్రస్తుతం అమెరికా పశ్చిమాసియా దేశాలపైనే అధికంగా దృష్టి సారించిందన్నారు. ఇది సరి కాదని.. ఇతర దేశాలతోనూ సత్సంబంధాలు ఉండటం అవసరమని హేలీ స్పష్టం చేశారు. అప్పుడే భారత్, జపాన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్ తదితర దేశాలన్నీ అమెరికాతో కలిసి వస్తాయని చెప్పారు.
చైనా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగోలేదన్నారు. అయినా.. డ్రాగన్ నాయకత్వం అమెరికాతో యుద్ధానికి సన్నద్ధమవుతోందని, అది ఘోర తప్పిదమేనని వ్యాఖ్యానించారు. నెవాడా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో హేలీకి 31 శాతం ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ఆమె కంటే ముందున్న ట్రంప్ ఇక్కడ పోటీ పడలేదు.
నోటా తరహాలో ‘ ఈ అభ్యర్థులెవరూ కారు’ అనే కాలమ్ను బ్యాలెట్ పత్రంలో ఉంచారు. దానికి 63 శాతం ఓట్లు పోలయ్యాయి. నెవాడాలో 1975లో నోటాను ప్రవేశపెట్టిన అనంతరం ఓటమిపాలైన తొలి అభ్యర్థి హేలీయే.