Pakistan General Elections 2024: హింస, ఉగ్రవాదంతో పాటు.. ఆర్థిక సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయిన పాకిస్తాన్ లో నేడు (ఫిబ్రవరి 8) సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 12.85 కోట్ల ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోకున్నారు. ఈ మేరకు అక్కడ రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉండగా.. ఆరేళ్ల తర్వాత విదేశాల నుంచి తిరిగి స్వదేశానికి వచ్చిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం.. మరోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవాజ్ షరీఫ్ చేతికే అధికారం వస్తే.. 74 ఏళ్ల వయసులో.. నాలుగోసారి పాక్ ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు ఖాయం.
నవాజ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అత్యధిక సీట్లను సాధించేలా కనిపిస్తోంది. ఇమ్రాన్ పార్టీ అయిన పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ పై ఈసీ నిషేధం విధించడంతో.. ఆ పార్టీ అభ్యర్థులంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సైతం ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. 336 సీట్లకు గాను.. 266 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు. ఇంకొక 10 సీట్లను మైనార్టీలకు కేటాయించారు. 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కాగా.. ఎన్నికలకు ఒకరోజు ముందు.. ఫిబ్రవరి 7న బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉగ్రవాదులు బాంబుదాడులతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో సుమారు 28 మంది మరణించారు. బాంబుదాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 6.5 లక్షల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు.