Narayanaswamy’s difficulties: నియోజకవర్గం మార్చడంతో టెన్షన్ పడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామికి.. తిరిగి సిట్టింగ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకునే లోపే ఉప ముఖ్యమంత్రికి మరో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులు తిరుగులేదనుకున్న నియోజక వర్గంలో ఆయనకి కష్టాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం జీడినెల్లూరు నియోజకవర్గంలో ఆయనపై అసమ్మతి భగ్గుమంటోంది. నారాయణస్వామిని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రోడ్డెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నికల్లో నారాయణ స్వామికి పనిచేసే ప్రసక్తే లేదని అల్టిమేటం ఇస్తున్నారు. దాంతో డిప్యూటీ దిక్కులు చూడాల్సి వస్తోందంట.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్ని వీర విధేయులు.. తమిళ మాల సామాజికవర్గానికి చెందిన ఆయన.. అవసరమైనప్పుడల్లా ఆ కార్డు బయటకి తీసి ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంటారు. ఆయన నోటికి విపక్షాలే కాదు వైసీపీ నేతలే భయపడతారన్న టాక్ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు కమ్మ సామాజిక వర్గంపై ఓంటికాలితో లెగుస్తుంటారు. ఆ తిట్ల పురాణాలతోనే ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడు అయ్యారంటారు.
అలాంటి నారాయాణస్వామిని కూడా ముందు చిత్తూరు ఎంపి అభ్యర్ధిగా ప్రకటించింది వైసీపీ.. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జీడినెల్లూరు సెగ్మెంట్ని వదలడానికి ఆయన ఇష్టపడలేదు . ఆ అసంతృప్తితో డిప్యూటీ సీఎం పార్టీకి రివర్స్ అయి.. విమర్శలు మొదలుపెడితే .. లేనిపోని తలనొప్పని భయపడ్డారో? ఏమో? కాని రోజుల వ్యవధిలోనే ఆయన్ని తిరిగి జీడి నెల్లూరుకి మార్చేశారు.
డిప్యూటీ సియం నారాయణస్వామికి ఇప్పుడా సంతోషం లేకుండా చేస్తున్నారంట జీడినెల్లూరు వైసీపీలోని అసమ్మతి నేతలు.. మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుతో.. సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎంపీ జ్ణానేంద్ర రెడ్డి వర్గం అయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానికితోడు నియోజకవర్గంలోని పెనుమూరు, జీడినెల్లూరు, పాలసముద్రం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలలో అయనకు వ్యతిరేకంగా వర్గాలు తయారయ్యాయి.
టికెట్ కేటాయింపులు మొదలు కాక ముందు నుంచే.. ఆ అసమ్మతి నేతలు.. నారాయణస్వామికి టికెట్ ఇవ్వవద్దని.. పార్టీ సినియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి ఇంటి చుట్టు పలుమార్లు ప్రదక్షిణలు చేసారు. మాజీ మంత్రి కుతుహాలమ్మ సమీప బంధువు అయిన నూకతోటి రాజేష్కు జీడినెల్లూరు నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే రాజేష్ను సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ.. నారాయణస్వామికి తిరిగి జీడినెల్లూరు సమన్వయ బాధ్యతలు కట్టబెట్టింది. దాంతో అసమ్మతి సెగలు మళ్లీ రాజుకుంటూ.. గట్టిగానే తాకుతున్నాయంట ఉప ముఖ్యమంత్రికి.
జీడినెల్లూరు మండల కేంద్రంలో రహాదారి మీదా అసమ్మతి వర్గం నారాయణ స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించింది. జగన్ ముద్దు నారాయణ స్వామి వద్దు అన్న స్లోగన్లతో హోరెత్తించింది. నారాయణ స్వామి వల్ల తాము అర్థికంగా దెబ్బతినడమే కాకుండా.. పార్టీ కూడా తీవ్రంగా నష్ట పోయిందని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలోను నారాయణస్వామికి సహాకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్తున్నారు. ఆ ఎఫెక్ట్తో టికెట్ ఖరారైందన్న ఆనందం లేకుండా పోయిందంట డిప్యూటీకి.. మరి ఈ కష్టాలను ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి.