Bomb Blasts in Pakistan Ahead of Elections: పాకిస్థాన్లోని నైరుతి ప్రావిన్స్లోని బలూచిస్థాన్లోని ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో బుధవారం రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు తెలిపారు. ఈ పేలుళ్లలో 22 మంది మృతి చెందారు. గురువారం పాకిస్థాన్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.
ఇటీవలి నెలల్లో పెరుగుతున్న తీవ్రవాద దాడులు, ఆర్థిక సంక్షోభం, అణ్వాయుధ దేశాన్ని దడపుట్టిస్తున్న ఇతర కష్టాలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ ఎన్నికలకు వెళ్తోంది. తాజాగా గత ఎన్నికల్లో గెలిచిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష మధ్య పాక్ ఈ డిసిషన్ తీసుకుంది.
పిషిన్ జిల్లాలో స్వతంత్ర ఎన్నికల అభ్యర్థి కార్యాలయంలో మొదటి దాడి జరిగింది. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖిల్లా సైఫుల్లా పట్టణంలో రెండవ పేలుడు జమియాత్ ఉలేమా ఇస్లాం (JUI) కార్యాలయం సమీపంలో జరిగింది.
ఈ దాడుల వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇస్లామిస్ట్ మిలిటెంట్ పాకిస్తానీ తాలిబాన్, బలూచిస్తాన్ నుంచి వచ్చిన వేర్పాటువాద గ్రూపులతో సహా అనేక గ్రూపులు పాకిస్థాన్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలి నెలల్లో దాడులు చేశాయి.
Read More : సంక్షోభాల నడుమ పాక్ ఎన్నికలు..
పిషిన్లో పేలుడు జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఖాన్జాయ్ ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 12గా ఉంది. ఈ పేలుడులో దాదాపు 25 మందికి పైగా గాయపడినట్లు పిషిన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జుమ్మా దాద్ ఖాన్ తెలిపారు.
ఎన్నికల ముందు రోజు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఈ దాడులు జరిగాయి.
జైలు శిక్ష అనుభవిస్తోన్న పాక్ మాజీ ప్రధాని ఖాన్, ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ల వెలుపల వేచి ఉండాల్సిందిగా తన మద్దతుదారులను కోరారు.
బూత్ల దగ్గర ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమిగూడడం ఉద్రిక్తతలను పెంచుతుందని అతని పార్టీ ప్రచారంపై నిషేదం విధించారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని సైన్యం ఖండించింది.