15 former MLA’s joined BJP in Tamil Nadu: తమిళనాడులో అధికార డీఎంకే సహా ప్రతిపక్ష అన్నాడీకేం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట తమిళనాడులో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఈ తరుణంలోనే రాష్ట్రానికి చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బుధవారం పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్. మురుగన్లు పార్టీలో చేరినవారికి కండువా కప్పి ఆహ్వానించారు. వీరిలో ఎక్కువమంది అన్నాడీఎంకే (AIADMK)కు చెందినవారు కావడం గమనార్హం. దీంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నాయకుల చేరికతో తమిళనాడులో బీజేపీ మరింత బలోపేతమవుతుందని అన్నామలై అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలే కారణమనన్నారు. ఈసారి తమిళనాడు ప్రజలు తప్పకుండా బీజేపీకే మద్దతు పలుకుతారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు చేపట్టినప్పటినుంచి అధికార, విపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ.. బీజేపీ సిద్ధాంతాలను బలంగా వినిపిస్తున్నారు.
‘ఎన్ మన్- ఎన్ మక్కల్’ (నా భూమి- నా ప్రజలు) పేరుతో అన్నామలై చేపట్టిన పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభించింది. ఈనెల 25న కోయంబత్తూరులో పాదయాత్ర ముగింపు వేడుకలో ప్రధాని మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతో పాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబరులో ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరారు.