Indian origin student dies in USA: అమెరికాలో మరో భారత సంతతి మరో విద్యార్థి మృతి చెందాడు. ఇది ఈ సంవత్సరంలోనే చోటుచేసుకున్న ఐదో ఘటన కావడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదువుతున్న సమీర్ కామత్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. సోమవారం సాయంత్రం స్థానిక నేచర్ రిజర్వ్ వద్ద అతడు విగతజీవిగా కన్పించినట్లు అధికారులు వెల్లడించారు.
23 ఏళ్ల సమీర్కు అమెరికా పౌరసత్వం ఉంది. గతేడాది ఆగస్టులో అతడు మాస్టర్స్ పూర్తి చేశాడు. పీహెచ్డీలో చేరాడు. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. భారత మూలాలున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఈ ఏడాదిలో ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.
కాగా.. ఇటీవల పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారత సంతతి విద్యార్థి నీల్ ఆచార్య కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కొన్ని గంటల పాటు అతడు ఎవ్వరికీ కనిపించలేదు. దీంతో పోలీసులు గాలించగా అతని మృతదేహం లభ్యమైంది. గతవారం ఒహాయోలో భారత-అమెరికన్ విద్యార్థి శ్రేయాస్రెడ్డి మరణించాడు. ఇక, జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ ఓ నిరాశ్రయుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. జనవరిలో మరో భారతీయ విద్యార్థి అకుల్ ధవన్ ఇల్లినాయ్ యూనివర్సిటీ వెలుపల శవమై కనిపించాడు.