Food Outlets Conditions in Ayodhya: అయోధ్యకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. తొలి 12 రోజుల్లోనే దాదపు 25 లక్షల మందిని భవ్య రామమందిరాన్ని సందర్శించుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. నవమి వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వరకు వారానికి 10-12 లక్షల మంది అయోధ్యకు తరలివస్తారని అంచనా.
ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లోనూ, చుట్టుపక్కల ఫుడ్ అవుట్ లెట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ చెయన్స్ డొమినోస్, పిజ్జా హట్ బిజినెస్ ఇప్పటికే ఇబ్బడిముబ్బడైంది. అయోధ్య-లఖ్నవూ హైవేపై ఉన్న కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్సీ) అవుట్లెట్ను కూడా ఆలయ పరిసరాల్లో అనుమతించనున్నారు. అయితే కండిషన్స్ అప్లై. వెజిటేరియన్ ఆహార పదార్థాలను మాత్రమే ఆ సంస్థ అందించాల్సి ఉంటుంది.
అయోధ్య ఆలయ పరిసరాల్లోని పంచ కోసి మార్గ్లో మాంసం, మద్యం విక్రయాలు నిషిద్ధం. పంచ కోసి పరిక్రమ అనేది అయోధ్య చుట్టూ ఉన్న 15 కిలోమీ టర్ల పవిత్రమైన తీర్థయాత్ర సర్క్యూట్. అందుకే పంచ్ కోసి మార్గ్ లోపల శాకాహార వంటకాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీనికి వెలుపల మాత్రమే మాంసాహారం అందించే అవుట్ లెట్లను ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.