Buggana Rajendranath AP Budget Speech: ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ స్పీచ్ అత్యంత చప్పగా సాగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభలో సీఎం జగన్ హావభావాలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. దాదాపు 2 గంటలపాటు బుగ్గన సుధీర్ఘంగా మాట్లాడారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. లబ్ధిదారుల లెక్కలు చెప్పారు. ఆయా పథకాలకు చేసిన ఖర్చులు తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర ఈ 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేశామంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇందులో ప్రతి అంశంపైనా చాలాసేపు మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి పనులపై బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన నస పుట్టించారని విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రతిరంగంపై అంకెల గారడీ వల్లెవేశారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగుతున్న సమయంలో సీఎం జగన్ ఇదేంటో బాబోయ్ అన్నట్లుగా కనిపించారు. బుగ్గన స్పీచ్ ఎఫెక్టివ్గా లేకపోవడంపై జగన్ కాస్త అసహనంగా కనిపించారు. ఒక సమయంలో ఆయనకు ఆవలింతలు కూడా వచ్చాయి. ఇలా ఏకంగా సీఎం జగన్కే బోర్ కొట్టేలా బుగ్గన బడ్జెట్ స్పీచ్ సాగింది.
అటు సభలోని వైసీపీ సభ్యుల పరిస్థితి సీఎం జగన్ మాదిరిగానే ఉంది. సభను నిశ్శబ్దం ఆవరించింది. వైసీపీ ఎమ్మెల్యేలందరూ సైలెంట్ అయిపోయారు. చడీచప్పుడు లేకుండా కునికిపాట్లు పడ్డారు. ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాం.. ఇవి ప్రభుత్వం సాధించిన ఘనతలు అని బుగ్గన పదే పదే అవే మాటలు చెబుతున్నా వైసీపీ సభ్యుల నుంచి స్పందన కరువైంది. హర్షధ్వానాలు రాలేదు. చప్పట్ల కొట్టలేదు. కనీసం సీఎం జగన్ కూడా సంతోషంపై వ్యక్తపరిచినట్లు ఎక్కడా కనిపించలేదు. కానీ బుగ్గన మాత్రం అలా చెప్పుకుంటూ పోయారు.
గత ఐదేళ్లలో ఏం చేశామో ఆర్థికమంత్రి బుగ్గన చెప్పారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించామని చెప్పారు. కానీ భవిష్యత్తు చేపట్టే కార్యక్రమాలు వివరించారు. కొత్త హామీలు ఇవ్వలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లపై మాట్లాడలేదు. డీఎస్సీ ద్వారా 6,100 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని మాత్రమే తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రస్తావించలేదు. వారి కోసం ప్రభుత్వం ఏం చేసిందో అది మాత్రమే చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై సాధారణ ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. ఎన్నికల పద్దు అంకెల గారడీగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సభ నుంచి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాలకృష్ణ, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, గణబాబు, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావును సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో వారికి బుగ్గన బడ్జెట్ ప్రసంగం వినే బాధ తప్పింది. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తో సభ కూడా చప్పగా సాగింది.వారు సభలో ఉండి ఉంటే కాస్తైనా హీట్ పుట్టేది. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బుగ్గన బడ్జెట్ ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదని విమర్శలు వస్తున్నాయి.