Ap bifurcation act: ఏపీ విభజన జరిగిన ఎనిమిదిన్నర ఏళ్లు కావస్తున్నా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రక్రియను 10 ఏళ్లలోపు పూర్తి చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో నిబంధనలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు సమావేశాలు నిర్వహించినా ఇంకా చాలా సమస్యలు కొలిక్కిరాలేదు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ విభజన సమస్యలపై ఈనెల 23న ఢిల్లీలో కేంద్రహోంశాఖ మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపింది. సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే సమావేశంలో పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించింది.
పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై సెప్టెంబర్ 27న సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీకి సంబంధించిన 7 అంశాలపైనా అధికారులు చర్చించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టుపై గత సమావేశంలో చర్చించారు. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఆ సమావేశం ముగిసింది.
విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను 10 ఏళ్లలోపు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కేంద్రహోంశాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల 23న తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది. మరి ఈ సమావేశంలోనైనా పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరకుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.