Hyderabad Latest Cyber Crime Case: మోసగాళ్లు అమాయకులను వలలో వేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రకరకాల మార్గాలు మోసాలు చేస్తున్నారు. ఇలా డిజిటల్ సేవలు అందిస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న కిలాడీ కేటుగాళ్లను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే, విమాన సేవలతోపాటు 300 రకాల సర్వీసులు అందిస్తామని నిందితులు ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చారు. వారి బుట్టలో పడ్డ అమాయకుల నుంచి నగదు రాబడుతున్నారు. వారి ప్రకటనను నమ్మి సంప్రదించిన వారికి ఐడీ క్రియేట్ చేసుకోవాలని టెలీ కాలర్ల ద్వారా మాయమాటలు చెప్పారు. ఐడీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 1800 రూపాయలు కట్టించుకున్నారు. ఆ తర్వాత కేవైసీ సహా పలు రకాల పేర్లతో వేల రూపాయలు దండుకున్నారు. ఇలా కుచ్చుటోపి పెట్టడం వీరి నైజం.
ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ డిజిటల్ బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్, జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ లిమిటెడ్ సంస్థ పేరుతో అక్రమ దందాను సాగిస్తున్నారని తేలింది. హైదరాబాద్ లోనూ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు. బేగంపేట వైట్హౌస్ భవనంలో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఈ కేసులో సీఈఓ ప్రతీక్ చావే, HR స్వర్ణలత, శ్రవణ్ లాల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు.