Ind vs Zim t20 (sports news today India):
క్రికెట్ అంటే ప్రపంచానికి తెలిసీ తెలియని కాలంలో, అప్పుడే ఇండియాలో కూడా క్రికెట్ ఓనమాలు దిద్దుతున్న సమయంలో, అన్ని దేశాలతో పాటు క్రికెట్ ఆడిన దేశం జింబాబ్వే. ఒకరకంగా చెప్పాలంటే అప్పుడు పిల్ల జట్టుగా ఉన్నా, అక్కడ అద్బుతమైన ఆటగాళ్లు ఉండేవారు. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్టులాగే, నాడు విజయాలు సాధించేవారు.
1983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా విజయానికి ఆనాడు అడ్డం పడిన జట్టు జింబాబ్వే అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్లో గెలవక తప్పని పరిస్థితి. అక్కడ ఓడితే ఇంటికి రావల్సిందే.
ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియా బ్యాటింగ్ చూస్తే మతి పోతుంది. సునీల్ గవాస్కర్ (0), శ్రీకాంత్ (0), అమరనాథ్ (5), సందీప్ పాటిల్ (1), యశ్ పాల్ శర్మ (9) ఇలా ఉంది. 17 పరుగులకి 5 వికెట్లు పడిపోయి ఇండియా విలవిల్లాడుతోంది.
ఈ దశలో వరల్డ్ కప్ హీరో కెప్టెన్ కపిల్ దేవ్ వచ్చాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 138 బాల్స్లో 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తనకి రోజర్ బిన్ని (22), మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్ ) అండగా నిలిచారు.
Read More :U19 World Cup 2024 : సీనియర్లూ చూశారా? : ఒత్తిడి నుంచి యువ ఇండియా గెలుపు
అలా 60 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే లక్ష్య ఛేదనలో 236 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అలా అక్కడి నుంచి టీమ్ ఇండియా ఫైనల్ వరకు వెళ్లి కప్ పట్టుకొచ్చేసింది.
ఇదంతా ఎందుకంటే జింబాబ్వే జట్టు ఆనాటి నుంచి ఉందని చెప్పడమే. కానీ కాలక్రమంలో వెస్టిండీస్ జట్టులాగే, ఆ జట్టు ప్రాభవం కూడా కోల్పోయింది. ఇప్పుడు కొత్త కొత్త జట్లు బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లన్నీ ఆడుతున్నాయి. వెస్టిండీస్ కూడా నెమ్మదిగా పుంజుకుంది. ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్కి, అమెరికాతో కలిసి ఆతిథ్యం ఇస్తోంది. ఇవన్నీ చూస్తున్న జింబాబ్వే తను కూడా మునుపటి తరహాలో పేరు తెచ్చుకోవాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా టీ 20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే వారం రోజుల్లోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. 5 మ్యాచ్ల టీ-20 సిరీస్ ఆడనుంది. అందుకు సంబంధించి భారత్ – జింబాబ్వే మధ్య జరిగే టీ20 సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. అన్ని మ్యాచ్లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యం ఇస్తోంది.
జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. నాలుగు డే మ్యాచ్లు ఆడతాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం అవుతాయి. మూడో టీ-20 నైట్ మ్యాచ్ మాత్రం ఇది సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది.
అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి సత్తా చాటేందుకు జింబాబ్వే చూస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్తో సిరీస్ జరుగుతుండటం పట్ల జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తవెంగ్వా ముకులానీ సంతోషం వ్యక్తం చేశారు.