U19 World Cup 2024 Semi-Final : ఒత్తిడిలో ఎలా ఆడాలో టీమ్ ఇండియా కుర్రాళ్లు ఆడి చూపించారు. మ్యాచ్ ని గెలిపించారు. దిగ్విజయంగా సెమీస్ నుంచి ఫైనల్ కు తీసుకువెళ్లారు. అండర్ 19లో 2016, 2018, 2020, 2022, 2024ల్లో వరుసగా ఐదు సార్ల నుంచి ఫైనల్ కి చేరుకుని ఒక రికార్డ్ సృష్టించారు. ఓవరాల్ గా చూస్తే 2000, 2006, 2008, 2012 ల్లో కూడా కలిపితే తొమ్మిదో సారి ఫైనల్ చేరిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో సీనియర్లు ఒత్తిడిలో పడి ఎలా ఓడిపోయారో చూసినవారందరూ.. ఇప్పుడు కుర్రాళ్లు ఆడిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది కదరా.. ఆటంటే! అనుకుంటున్నారు. నిజానికి వీరిని చూసైనా సీనియర్లు నేర్చుకోవాలి హిత బోధలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల్లో పడుతూ లేస్తూనే ఆడుతున్నారు.
నిజానికి టీమ్ ఇండియా కుర్రాళ్లు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ప్రారంభంలోనే తడబడ్డారు. ఒక దశలో 32 పరుగులకే టాప్ ఆర్డర్ 4 వికెట్లు పడిపోయాయి. అక్కడ నుంచి 245 పరుగుల టార్గెట్ ని ఎలా ఛేదించారనేది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుగా అనిపించింది.
Read More : http://Shubman Gill : ‘బాగా ఆడితే ప్రశంసిస్తారు.. లేదంటే విమర్శిస్తారు..’
చివరి వరకు బాల్ టు బాల్ అన్నట్టే మ్యాచ్ సాగింది. ఒకవైపు నుంచి అనూహ్యంగా వికెట్లు పడటం కాదు, రెండు రన్ అవుట్లు కూడా అయ్యాయి. చివరికి బౌలర్ రాజ్ లింబాని ఒక సిక్స్, ఫోర్ కొట్టి టెన్షన్ తగ్గించి విజయాన్ని అందించాడు. ఇక ఉదయ్ సహరన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన కళ్ల ముందే 4 వికెట్లు పడిపోతే, బీభత్సమైన డిఫెన్స్ ఆడాడు. తను చేసిన 81 పరుగుల్లో 124 బాల్స్ తీసుకున్నాడంటే అర్థం చేసుకోవాలి. వికెట్ కాపాడుకోవడమే పరమావధిగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు సచిన్ దాస్ (96) అద్భుతమైన సహకారం అందించాడు. అలా వీళ్లిద్దరూ మ్యాచ్ ని తిరిగి పట్టాలెక్కించారు. విజయం ముంగిట వరకూ తీసుకెళ్లారు.
నిజానికి అందరూ అనుకున్నదేమిటంటే సెమీఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయేలా ఉందని అనుకున్నారు. చాలామంది మ్యాచ్ లు చూసేవారు టీవీలు, సెల్ ఫోన్లు కట్టేశారు. కానీ కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ ఇద్దరూ కూడా చెత్త షాట్లకు వెళ్లకుండా సౌతాఫ్రికా పేసర్లను జాగర్తగా ఎదుర్కొంటూ బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయిదో వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అలా గెలిచి ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.