Hyderabad Weather Report: ఎండాకాలం ఇంకా రానే లేదు.. కానీ ఎండ సెగ మాత్రం మొదలైంది. ఫిబ్రవరి ఆరంభంలోనే హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల 6న గరిష్ఠంగా మోండా మార్కెట్లో 36.3 డిగ్రీలు నమోదైంది.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, కాప్రా, సరూర్నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ ఖైరతాబాద్తో సహా అనేక ఇతర ప్రాంతాలలో కూడా గత 24 గంటల్లో పాదరసం స్థాయిలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగాయి.
రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయని సమాచారం. రెండురోజుల క్రితం వరకు రాత్రి ఉష్ణోగ్రత 16 నుంచి 17 డిగ్రీల వరకు ఉంటే.. ఇప్పుడు ఏకంగా 21.2 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని తెలిపింది. ఈసారి ఎండలు ఎక్కువే ఉంటాయన్న సంకేతాలు ఆ శాఖ నుంచి వెలువడుతున్నాయి.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ యొక్క రోజువారి వాతావరణ నివేదికలో గత సంవత్సరం ఇదే తేదీ నుండి డేటాను పోల్చి చూస్తే.. మారేడ్పల్లిలో ఫిబ్రవరి 6, 2023న 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2024లో అదే తేదీన 19.3 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది.
IMD-H సూచన ప్రకారం రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో పగలు రాత్రి అనే తెడలేంకుండా ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడే ఏసీలను కూడా వాడటం ప్రారంభించారు. పగటిపూట 3,100 మెగావాట్ల వరకు డిమాండ్ ఉంటే.. రాత్రి 9 గంటలకు 2,697 మేర నమోదైయిందని తెలిపారు. గత ఏడాది ఇదే నెలలో రాత్రిపూట 2,287 మెగావాట్లే డిమాండ్ ఉంది.