Constable murder case in AP(Andhra news today): రెడ్ అలర్ట్. ఎర్రదుంగల దొంగలు ప్రాణం తీశారు. కానిస్టేబుల్ను కనికరం లేకుండా కారుతో తొక్కించేశారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన హోంశాఖలో తీవ్ర కలకలానికి దారితీసింది. స్మగ్లర్లను చట్టసభకు పంపిస్తే ఇలాగే ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ఎర్రస్మగ్లర్లు బరి తెగించారు. స్మగ్లర్ల కారును ఆపడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ పైకి దూసొకెళ్లి నిండుప్రాణం తీశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన ముందస్తు సమాచారం ప్రకారం అన్నమయ్య జిల్లా కేవీ మండలం చీనేపల్లి వద్ద కూంబింగ్ నిర్వహించారు. స్విప్ట్ డిజైర్ కారును ఆపడానికి ప్రయత్నించారు. కారులోని దుండగులు ఆపకుండా పోలీసుల మీదకు వేగంగా దూసుకెళ్లారు. ఆపడానికి ప్రయత్నించిన గణేష్ అనే కానిస్టేబుల్ పైకి వెళ్లడంతో రెండు కాళ్లు నలిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన గణేష్ ను పీలేరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందారు. చనిపోయిన కానిస్టేబుల్ గణేశ్ కుటుంబానికి 30 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
2013లో శేషాచలం అడవుల్లో గొడ్డళ్లతో దాడి చేసి ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లను ఎర్ర కూలీలు చంపారు. ఆ తర్వాత అప్పటి సీఎం కిరణ్ కూమార్ రెడ్డి డీఎస్పీ స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు డీఐజీ స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. స్మగ్లింగ్ ను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. అప్పట్లో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో టాస్క్ ఫోర్స్ ఏకంగా 20 మంది స్మగ్లర్లను చంపేసింది. దాని ప్రభావంతో ఎర్ర చందనం అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడీ ఘటన జరగడంతో పోలీస్ డిపార్ట్మెంట్ సైతం ఉలిక్కి పడింది.
మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారికి టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే స్మగ్లర్లు బరి తెగించరా అని ప్రభుత్వంపై ఫైరయ్యారు.
2014 నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతకాలం ఎర్రచందనం స్మగ్లింగ్ ను టాస్క్ ఫోర్స్ సమర్థంగా అడ్డుకుంది. ప్రభుత్వం మారి జగన్ అధికారంలోకి రాగానే 2019 తర్వాత టాస్క్ ఫోర్స్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గించారు. దాని స్థానంలో సెబ్కి ప్రాధాన్యత ఇచ్చారు. సెబ్ స్మగ్లింగ్ పై అంతగా ఫోకస్ చేయలేకపోయింది. స్మగ్లరు ఎర్ర చందనాన్ని యథేచ్చగా తరలిస్తున్నారు. అయినా ఎక్కడా అరెస్టులు జరగలేదు. ఇలాంటి స్థితిలో స్మగ్లర్లు ఎలాంటి భయం లేకుండా కారుతో ఢీకొట్టడం, కానిస్టేబుల్ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.