Siva Balakrishna case updates(Today news in telangana): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శివ బాలకృష్ణకు నవీన్ బినామీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీగా వ్యవహరించి.. ఆస్తులు కూడబెట్టినట్టుగా నిర్ధారించారు. నవీన్ ను మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. నవీన్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆయనను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో చాలామందిపై ఆరోపణలు రావడంతో వారందరిపైనా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
నేటితో శివ బాలకృష్ణ కస్టడీ ముగియనుండగా.. మరోసారి ఆయనను కస్టడీకి కోరనున్నారు ఏసీబీ అధికారులు. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు శివబాలకృష్ణను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు నవీన్ అరెస్ట్ తో ఈ కేసు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అలానే శివ బాలకృష్ణ బినామీల పేరుపై 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో సోమవారం, మంగళవారం రెండు రోజులు వరుసగా.. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసినట్టు టాక్ వినిపిస్తుంది.
శివబాలకృష్ణ.. భరత్ కుమార్ అనే మరో బినామీ పేరుపై కూడా భారీగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం అందుతుంది. పుప్పాలగూడ, నార్సింగిలో నిషేధంలో ఉన్న రెండు రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్ల ఫైల్స్ ను క్లియర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వందల కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్టు అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సైతం పెండింగ్ లో ఉన్న వందకు పైగా ఫైల్స్ ను బాలకృష్ణ క్లియర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.