Attack On Hyderabad Student in Chicago : అమెరికాలోని చికాగో నగరంలో హైదరాబాద్కు చెందిన విద్యార్థిపై నలుగురు దొంగలు దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు లంగర్ హౌజ్ నివాసి. మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి యుఎస్ వెళ్ళాడు. ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయంలో మజాహిర్ అలీ ఎమ్ఎస్ చేస్తున్నాడు. అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థులపై పలుమార్లు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త భయాందోళనకు గురి చేస్తోంది.
ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అలీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తన చేతిలో ఫుడ్ ప్యాకెట్తో ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని అలీ వీడియోలో చెప్పారు. క్యాంప్బెల్ అవెన్యూలోని అలీఇంటి సమీపంలో మంగళవారం ముగ్గురు అలీని వెంబడించి దాడి చేసినట్లు CCTV ఫుటేజీ వెల్లడించింది.
తనపై దాడి చేసి తన ఫోన్ను దొంగిలించారని తెలిపాడు. ఈ వీడియో అమెరికాలోని భారతీయుల భద్రతపై నెటిజన్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
దయచేసి తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని, అగ్రరాజ్యంలోని మన దౌత్య సిబ్బందిని అభ్యర్థించారు. దీంతో అతడి పరిస్థితిపై హైదరాబాద్లో ఉంటున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తకు సాయం చేయాలంటూ అలీ భార్య ఫాతిమా రిజ్వి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు లేఖ రాశారు. తన భర్తపై దాడి జరిగిందని అతడి స్నేహితుడొకరు ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు.
ఆయన భద్రతపై మాకు ఆందోళనగా ఉందన్నారు. దయచేసి ఆయనకు సరైన చికిత్స అందేలా చూడండని విన్నవించుకున్నారు. వీలైతే తనకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
గత వారం, మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ శవమై కనిపించాడు. అతను ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో విద్యార్థిగా ఉండగా, అతని తల్లిదండ్రులు హైదరాబాద్లో నివసిస్తున్నారు. దీనికి ముందు, జనవరి 16న జార్జియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీ అనే వ్యక్తిని హత్య చేశారు.