Vallabhaneni Vamsi Mohan Political future : సైకిల్ గుర్తుతో గెలిచి.. ఫ్యాన్ కింద సేదతీరడానికి వెళ్లిన ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్వం అంతుపట్టకుండా తయారవుతోంది. ఇప్పటికే వైసీపీకి మద్దతు పలుకుతున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరి టికెట్ గల్లంతైంది. గుంటూరు వెస్ట్లో మద్దాలి గిరిని పక్కన పెట్టేశారు జగన్.. ఇప్పుడు అదే పరిస్థితి గన్నవరంలోనూ కనిపిస్తోంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వల్లభనేని వంశీకి గన్నవరం వైసీపీ టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలక్కడ ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులేంటి?. వంశీని వైసీపీ అధ్యక్షుడు వేరే సెగ్మెంట్కి మారుస్తారా? అసలుకే ఎసరు పెడతారా?
వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది … ఇప్పటికే ఇన్చార్జ్లను మారుస్తూ ఆరుజాబితాలు విడుదల చేసిన వైసీపీ ఏడో లిస్ట్ రెడీ చేసే పనిలో పడింది. ఇప్పటి వరకు 82 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. దాంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. అదలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలురుగా మారిపోయారు. వారు నేరుగా పార్టీలో చేరకపోయినా అధికార పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. అయితే వారిలో ఇప్పటికే ఒకరికి టిక్కెట్ ను నిరాకరిస్తూ వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మిగిలిన స్థానాలపై కూడా కొన్ని అనుమానాలు బయలుదేరాయి.
టీడీపీ అభ్యర్ధిగా 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి, గుంటూరు వెస్ట్లో విజయం సాధించిన మద్దాలి గిరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ సౌత్ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్కుమార్ లు వైసీపీకి జై కొట్టారు. వారిలో గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరికి వైసీపీ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మంత్రి విడదల రజనిని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది
ఈ సారి గన్నవరం నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధిని గన్నవరం వెళ్లాలని వైసీపీ నాయకత్వం కోరినట్లు ప్రచారం జరిగింది. అఫ్కోర్స్ ఆయన దానికి అంగీకరించకుండా ఏకంగా పార్టీకే గుడ్బై చెప్పేశారు. పార్థసారథికి గన్నవరం సీటు ప్రతిపాదన వచ్చిందంటే వల్లభనేని వంశీని గన్నవరం తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమయినట్లేనా? అన్న అనుమానాలు బయలుదేరాయి. వల్లభనేని వంశీకి తిరిగి టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ స్థానంలో ఎవరికి టిక్కెట్ ఇస్తారన్న చర్చ జరుగుతుంది.
వల్లభనేని వంశీ గన్నవరం నుంచి రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో 800 పైచిలుకు మెజార్టీతోనే ఆయన గట్టెక్కగలిగారు. ఎప్పుడైతే వంశీ వైసీపీ బాట పట్టారో.. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. టీడీపీలో చేరి గన్నవరం ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గన్నవరంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు . మరోవైపు గన్నవరం వైసీపీలో మరో బలమైన నేత దుట్టా రామచంద్రరావు కూడా వల్లభనేని వంశీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇక నూజివీడు టీడీపీలో మారుతున్న సమీకరణలు కూడా వంశీకి ఎర్త్ పెడుతున్నట్లే కనిపిస్తున్నాయంటున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధికి అక్కడ టికెట్ నిరాకరించిన వైసీపీ మంత్రి జోగి రమేష్ని ఇన్చార్జ్గా నియమించింది. దాంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారు. ఈ సారి పార్థసారథి టీడీపీ టికెట్తో నూజివీడు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే నూజివీడు టీడీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అక్కడ నుంచి పోటీకి రంగం సిద్దం చేసుకున్నారు.
ముద్రబోయిన వెంకటేశ్వరరావు 2004 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఇండిపెండంట్గా గెలిచిన నాయకుడు. దివంగత వైఎస్ హవా వీచిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు షాక్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి గన్నవరం నుంచి నూజివీడుకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు పార్థసారథికి నూజివీడు టిడిపి దక్కితే.. ముద్రబోయిన వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసిపి పెద్దలు కూడా ముద్రబోయిన తో చర్చలు జరిపి గన్నవరం వైసిపి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారన్న టాక్ గన్నవరం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది.
అయితే ఆ ప్రచారాలలో ఏమాత్రం నిజం లేదని నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దరబోయిన మాత్రమే అని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ముద్రబోయిన వైసిపి పెద్దలకి టచ్లోకి వెళ్లినట్లు.. గన్నవరం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు.. గన్నవరం సీటు ఇవ్వడానికి కూడా వైసిపి సమ్మతించినట్లు చెబుతున్నారు.
మరి ఆ ప్రచారంలో ఎంత వరకు నిజముందో కాని.. గన్నవరంలో వంశీ ఫ్యూచర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వల్లభనేని వంశీని పూర్తిగా పక్కన పెడతారా? లేకపోతే ఆయనకు మరొక సీటును కేటాయిస్తారా? అన్న చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఆయన విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?